CM Revanth Reddy: 2034 వరకూ ప్రజా ప్రభుత్వానిదే అధికారమని సీఎం రేవంత్ రెడ్డి మరోమారు పునరుద్ఘటించారు. బీఆర్ఎస్ కు గతమే ఉందన్న ఆయన.. భవిష్యత్తు మాత్రం ప్రజా ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. హైదరాబాద్ ఘట్కేసర్ లో అందేశ్రీ స్మృతి వనం శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. అందెశ్రీ తనకు ఆత్మబంధువని, తన రాజకీయ ప్రయాణానికి ఆయనొక స్ఫూర్తి అని పేర్కొన్నారు.
ఉద్యమ గీతాలతో తెలంగాణలో చైతన్యం నింపిన మహాకవి అందెశ్రీ అని రేవంత్ కొనియాడారు. జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని గత పాలకులు కుట్రపూరితంగా అణిచివేయాలని చూశారని ఆరోపించారు. ఇప్పుడు తెలంగాణలో ప్రతి బడిలో, ప్రతి గడపలో అందెశ్రీ గీతం మార్మోగుతోందని పేర్కొన్నారు. ఆత్మగౌరవంతో దొరల గడప తొక్కని వ్యక్తి అందెశ్రీ అని రేవంత్ గుర్తు చేశారు. గద్దర్, అందెశ్రీ వంటి ఉద్యమకారులను అవమానించిన రోజే పాత పాలనకు ప్రజలు ముగింపు పలికారని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి అందెశ్రీ, గద్దర్, సోనియా గాంధీలే స్ఫూర్తి అని రేవంత్ అన్నారు.
సరూర్ నగర్ లో కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన యువజన సభ పై ఈ సందర్భంగా సీఎం రేవంత్ స్పందించారు. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు ఇప్పుడు నీతులు చెబుతున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సమాజం వారి దోపిడీని ఇంకా మరిచిపోలేదన్నారు. గజ్వేల్లో మీ రాజకీయ సమాధి తవ్వేది తెలంగాణ యువతే అంటూ వ్యాఖ్యానించారు. నిరుద్యోగులు మాయగాళ్ల మాటలు నమ్మొద్దన్నారు. ప్రతి ఖాళీని భర్తీ చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.
Also Read: ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!
గత ప్రభుత్వం పేపర్ లీకేజీలతో యువత భవిష్యత్తును నాశనం చేసిందని సీఎం రేవంత్ ధ్వజమెత్తారు. తాము అడ్డంకులు తొలగించి ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ఏడాదిలోనే 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని పునరుద్ఘటించారు. ఎల్బీ స్టేడియం, శిల్పకళా వేదికలో నియామక పత్రాలు అందించి తల్లిదండ్రుల ఆనందం చూశామన్నారు. పదేళ్లు నోటిఫికేషన్లు ఇచ్చినా ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేకపోయారని బీఆర్ఎస్ ను రేవంత్ ప్రశ్నించారు. మరోవైపు శంకరమ్మ, చాకలి ఐలమ్మ మనుమరాలు, కోదండరాం వంటి ఉద్యమకారులను తమ ప్రభుత్వం గౌరవించిందని.. 9 మంది కవులను కోటి రూపాయల నగదు బహుమతితో సత్కరించామని సీఎం రేవంత్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
Also Read: ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్