Kharif Farming: స్వేచ్చ బ్యూరో: ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది.భూముల్లో దుక్కులు పూర్తయి పత్తి విత్తనాలు ఇప్పటికే భూమిలో పెట్టారు.మిరప, పొగాకు వంటి పంటల సాగుకు నారుమడులు పోసి పంట సాగుకు సమాయత్త మవుతున్నారు. ఎల్ నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో వేసిన పత్తి విత్తనాలు మలవక భూమిలోనే మక్కిపోవడంతో మరోసారి పొలాలను సిద్ధం చేసుకుని విత్తనాలు నాటుకునే పరిస్థితి వచ్చింది.
దీంతో అన్నదాతల కళ్ళల్లో సాగుపై ఆనందం కంటే ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది. వ్యవసాయ సాగుకు కావలసిన పెట్టుబడులు ఏటేటా అమాంతంగా ఖర్చులు పెరుగుతుండడంతో సతమతమవుతున్నారు.విత్తనాలు, ఎరుల ధరలతో పాటు ట్రాక్టర్ కిరాయిలు, కూలీల రేట్లు గణనీయంగా పెరగడంతో సాగుపై లాభసాటికి బదులు అప్పులు పెంచుతున్నాయి. శ్రమకోర్చి పండించిన పంటను అమ్ముకున్నా పెట్టుబడి ఖర్చులు కూడా తిరిగి రాక అప్పుల ఊబిలోనే కోరుకుపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 19.34 లక్షల ఎకరాలలో వరి,పత్తి,మొక్కజొన్న, కంది, జొన్న,పొగాకు, కూరగాయలు, ఉద్యానవన,తదితర పంటల సాగు కోసం రైతులు భూమిని సిద్ధం చేసుకున్నారు. అయితే గత ఎడాదితో పోలిస్తే ఈసారి ఖర్చులు భారీగా పెరిగాయి. అంటే కేవలం భూమిని సిద్ధం చేసుకునేందుకే రోటవేటర్ చేసేందుకే గంటకు 1200 ఖర్చు చేయాల్సి వస్తోంది. దున్నడం, టిల్లర్ ,పాయడం వంటి వాటికి ఎకరాకు 1000 వరకు ఇవ్వాల్సి వస్తోంది. జూన్ లో అడపాదడపా కురిసిన వర్షాలకు పొలంలో పెట్టిన విత్తనాలు మొలవకపోవడంతో పలు మార్లు సేద్యాన్ని చేయాల్సి వస్తోంది.
Also read: Food Adulteration Law: ఆహార కల్తీ దందాకు ఇక చెక్.. తెలంగాణలో రాబోతున్న కొత్త చట్టం ఇదే!
యూరియా, డిఏపి పాత ధరలకే అందుబాటులో ఉన్నప్పటికీ కాంప్లెక్స్ ఎరువుల ధరలను కంపెనీలు బస్తాకు రూ. 100 నుండి 500 వరకు పెంచాయి.యూరియా ధరలు 266 ఉన్నప్పటికీ హమాలీ,రవాణా చార్జీల పేరుతో డీలర్లు 300 కు పైగా వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. డిఏపి 1350 కే అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు
వ్యవసాయ రంగంలో కూలీల కొరత తీవ్రంగా వేధిస్తోంది.కూలీలు దొరకకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.ఇతర ఉపాధి అవకాశాల వైపు కూలీలు మొగ్గు చూపడం, ఇతరుల పొలాలను కాళ్లకు తీసుకొని వ్యవసాయం చేయడంతో కూలీల కొరత ఏర్పడుతోంది. ఫలితంగా డిమాండ్ పెరిగి కూలీల రేట్లు పెరిగి భగ్గుమంటున్నాయి. ఏ గ్రామంలో ఆ గ్రామానికి సంబంధించిన వ్యవసాయ పనులు చేసేందుకు గ్రామంలోని కూలీలు గతంలో అందుబాటులో ఉండగా ప్రస్తుతం పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకొస్తూ పనులు చేయించుకునే పరిస్థితి దాపురిస్తోంది.
రైతే రాజు అని గొప్పగా చెప్పుకుంటున్నా అందుకు తగ్గట్లు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా ఖరీఫ్, రబీ సీజన్లలో డిమాండ్ కు అనుగుణంగా వివిధ రకాల పంటలను ఎంపిక చేసుకొని సాగు చేస్తున్నా వాతావరణ మార్పుల కారణంగా తెగుళ్లు చీడపీడల భారిన పడి పెట్టుబడులు తీవ్రమవుతున్నాయి అన్నిటిని అధిగమించి పంటలో దిగుబడులు సాధించినా మార్కెట్ లో ఆశించిన స్థాయిలో మద్దతు ధర లభించగా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.
Also read: KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్లో భారీ కొండ చిలువ హల్ చల్..!