MGNREGS: బ్యూరో స్వేచ్ఛ: ఉపాధి హామీ పథకం కొందరికి వరంగా మారింది. వారిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో అక్రమాలు జరిగినట్లు సోషల్ ఆడిట్ లోనే వెలుగులోకి వచ్చింది. పదేళ్లలో 25 వేల మందికి జరిమానా విధించడం, 346 మందిని విధుల నుంచి తొలగించారు. అంటే ఏమేరకు అక్రమాలు జరిగాయన్నది స్పష్టమవుతోంది. ఇప్పటికే కేంద్రం ఓవైపు ఉపాధి పనిదినాలు తగ్గిస్తూ నిధులు కోత పెడుతుంది. మరోవైపు అందులో పనిచేసే ఉద్యోగసిబ్బంది మాత్రం అక్రమాలకు పాల్పడుతున్నారనేది ఆడిట్ లోనే స్పష్టమైంది.
రాష్ట్రంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరు వెలుగులోకి వచ్చింది. గత పదేండ్లలో జరిగిన సోషల్ ఆడిట్ లెక్కలను కేంద్రం బయటపెట్టింది. 2015–16 నుంచి 2026 ఫిబ్రవరి వరకు రాష్ట్రంలో ఉపాధి హామీలో జరిగిన లొసుగులు, తీసుకున్న చర్యల వివరాలను వెల్లడించింది. చిన్న చిన్న తప్పులు మొదలు కొని నిధుల రికవరీ వరకు రాష్ట్రంలో 2.90 లక్షల మంది సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. అయితే, తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించడంలో కాకుండా కేవలం ‘వార్నింగ్’లు ఇచ్చి వదిలేయడంలో తెలంగాణ దేశంలోనే ప్రథమస్థానంలో నిలువడం గమనార్హం. ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు పాల్పడిన సిబ్బందిని హెచ్చరించడంలో మన రాష్ట్రం రికార్డు సృష్టించింది. రికార్డుల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, విధుల్లో నిర్లక్ష్యం వంటి కారణాలతో ఏకంగా 2,68,581 మంది ఉద్యోగులకు అధికారులు కేవలం వార్నింగ్ లు ఇచ్చారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ సిబ్బందికి వార్నింగ్లు ఇవ్వలేదు. రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నిలిచింది. ఆంధ్రప్రదేశ్ లోనూ 44 వేల మందికి హెచ్చరికలు జారీ చేసినట్లు సోషల్ ఆడిట్ లో వెలుగులోకి వచ్చిందని కేంద్రం పేర్కొంది.
Also Read: Ayub Khan: మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్ అయూబ్ ఖాన్ కోసం పోలీసుల వేట
2015 నుంచి ఉపాధిహామీ పథకంపై నిర్వహించిన సోషల్ ఆడిట్ లో ఉద్యోగుల తొలగింపు స్పష్టమైంది. వార్నింగ్లతోనే ఆగకుండా.. తీవ్రమైన తప్పులు చేసిన వారిపై వేటు వేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన 346 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు సోషల్ ఆడిట్ పేర్కొంది. మరో 314 మందిని సస్పెండ్ చేశారు. విధుల్లో అలసత్వం వహించిన 20,143 మంది సిబ్బందికి జరిమానా విధించారు. నిధుల దుర్వినియోగానికి బాధ్యులైన వారి నుంచి ఇప్పటివరకు రూ.5.96కోట్లు రికవరీ చేసినట్లు కేంద్రం పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి అక్రమాలపై 13 ఎఫ్ఐఆర్ లు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది.
క్షేత్రస్థాయిలో ఉపాధి పనుల కల్పనలో రాష్ట్రం క్రమంగా వెనకబడిపోతోందని కేంద్రం గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి పనుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2021–22లో 7.40 లక్షల పనులు పూర్తి కాగా..2024–25 నాటికి ఆ సంఖ్య 1.91 లక్షలకు పడిపోయింది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26)లో ఇప్పటివరకు కేవలం 1.04 లక్షల పనులు మాత్రమే పూర్తయ్యాయి. గతంలో పోలిస్తే ఉపాధి హామీ పని అడిగే కూలీల సంఖ్య కూడా తగ్గింది. 2020–21లో 54.29 లక్షల మంది ఉపాధి పొందగా, 2025–26 నాటికి ఆ సంఖ్య 30.83 లక్షలకు చేరింది. గ్రామాల్లో ఉపాధిహామీ పనులకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉండేది. అయితే యువత ఆసక్తి చూపకపోవడం, ఉన్నవారు సైతం పనులకు వెళ్లడం లేదని జాబ్ కార్డుల తగ్గుదలే స్పష్టమవుతుంది. మరోవైపు జాబ్ కార్డులకు ఆధార్ అనుసంధానంతోనే సంఖ్య తగ్గుతుందా అనే చర్చ సైతం జరుగుతుంది. మరోవైపు ప్రభుత్వం సైతం ఉపాధి నిధులు పక్కదారి పట్టకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటుండటం మరోకారణమా అనేది ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా కేంద్రం మాత్రం తెలంగాణలో జరుగుతున్న ఉపాధిహామీ లో అవకతవకలను వెలుగులోకి తీసుకురావడం హాట్ టాపిక్ అయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఉపాధిహామీ నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.
Also Read: Action Comedy OTT: దోపిడీ దొంగలకు షాక్ ఇచ్చే బ్యాంక్ ఉద్యోగి… ఆకట్టుకుంటున్న యాక్షన్ కామెడి