అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. ముందుగా బడ్జెట్ సమావేశాల్లోనే మూసీ, హైడ్రా అంశాల మీద ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ రెండు అస్త్రాల ద్వారానే రాబోయే ఎన్నికల్లోనూ అధికార పార్టీని ఇరకాటంలో పెట్టి మైలేజ్ పెంచుకోవాలని కారు పార్టీ అగ్రనాయకత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓ వైపు హైడ్రా అక్రమ కట్టడాల పేరిట కూల్చివేతలు చేపడుతుండగా.. తాజాగా మూసీ పునరుజ్జీవం పేరిట మరోసారి పేదల ఇండ్లను సర్కార్ కూల్చివేసేందుకు సిద్ధం అవుతున్నదని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది.
మూసీ పునరుజ్జీవంలో భాగంగా గాంధీ సరోవర్ ప్రాంతంలో బాపుఘాట్ నిర్మాణానికి రేవంత్ సర్కార్ భూమి సేకరణ చేస్తున్నది. ఈ క్రమంలోనే అక్కడున్న నిర్మాణాలను కూల్చివేసేందుకు సిద్ధమవుతున్నది.దీంతో అపార్ట్మెంట్లలో నివసించే బాధితులు గగ్గోలు పెడుతున్నారు. మూసీ సుందరీకరణకు తమ ఇండ్లు కూల్చాల్సిన అవసరం ఏమున్నదని,పిల్లల స్కూల్స్, ఉద్యోగాలు దగ్గర ఉన్నందునే ఇక్కడ ఇండ్లు కొనుక్కుని ఉంటుంటే.. ప్రభుత్వం చెల్లించే నష్టపరిహారం తీసుకుని తాము ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాగా, బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తున్నది. వీరి పక్షాన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని గులాబీ నేతలు రెడీగా ఉన్నట్టు చర్చ జరుగుతున్నది.
రాష్ట్రంలో మేడ్చల్ జిల్లా, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో జోరుగా కూల్చివేతలు జరుగుతున్నాయి. లక్షలాది మంది నిరాశ్రయులు అవుతున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. వారందరి కోసం తాము పోరాడటం చేస్తామని,అసెంబ్లీలోనూ సర్కారును ప్రశ్నిస్తామని చెబుతున్నది. ఇక గ్రేటర్ హైదరాబాద్లోని మూడు కార్పొరేషన్లకు జరిగే ఎన్నికల సమయంలో హైడ్రా, మూసీ పరివాహాక ప్రాంతాల్లోని బాధితులకు అండగా నిలుస్తామని, ప్రభుత్వం చేస్తున్న విధ్వంసానికి సంబంధించిన విజువల్స్ను ప్రచారం చేస్తూ వారిలో చైతన్యం కల్పిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తద్వారా గ్రేటర్ ఎన్నికల్లో సర్కారుకు చుక్కలు చూపిస్తామని కేటీఆర్ ఆశాభావంతో ఉన్నట్టు తెలిసింది.
Moinabad Drug Case: కేటీఆర్ డ్రగ్స్ టెస్టులకు సిద్ధమా? మహేశ్కుమార్ గౌడ్ సవాల్
కేటీఆర్ తన వద్ద ఉన్న అస్త్రాలు (హైడ్రా, మూసీ)తో రేవంత్ సర్కారును ఇరకాటంలో పెట్టాలని భావిస్తున్నది. కానీ, రేవంత్ టాక్టిక్స్ ముందు కేటీఆర్ పాచికలు పారుతాయా? అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్.ఎందుకంటే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో సీఎం రేవంత్, కాంగ్రెస్ సర్కారును టార్గెట్ చేస్తూ కేటీఆర్ ఎన్ని వ్యూహాలు రచించినా ప్రజలు అధికార పార్టీకే అండగా నిలిచారు. అలాంటప్పుడు కేటీఆర్ వద్దనున్న అస్త్రాలకు.. సీఎం రేవంత్ ప్రతివ్యూహాలు తప్పక రచిస్తారని, గ్రేటర్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయఢంకా మోగిస్తుందని హస్తం పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. ఆరు గ్యారెంటీలే గానీ, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, హైడ్రా, మూసీ బాధితులకు ఇండ్ల పట్టాలు, మంచి నష్టపరిహారం అందజేస్తామని ఇప్పటికే సీఎం ప్రకటించారని గుర్తుచేస్తున్నారు. ఇక అలాంటప్పుడు కేటీఆర్ అస్త్రాలు ఏమాత్రం పనిచేయవని, రేవంత్ ముందు ఆయన పప్పుడు ఉడకవని జోస్యం చెబుతున్నారు.