Vizag Metro: విశాఖపట్నం పర్యటనలో భాగంగా పురపాలక శాఖ మంత్రి నారాయణ నగర అభివృద్ధి, పెండింగ్లో ఉన్న కీలక ప్రాజెక్టులపై కీలక ప్రకటనలు చేశారు. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కోరిన మేరకు ఈ ప్రాజెక్టుపై మరోసారి సమగ్ర సర్వే నిర్వహించి నివేదిక ఇవ్వడానికి రైట్స్ (RITES) సంస్థకు బాధ్యతలు అప్పగించారు. ఈ నివేదిక రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుందని, ప్రాజెక్టు ఆలస్యం కాకుండా ఉండేందుకు ముందస్తుగానే టెండర్ల ప్రక్రియను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. వీటితో పాటు నగరంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు సెమీ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని VMRDA పరిశీలిస్తోందని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని 90కి పైగా మున్సిపాలిటీలు ,9 కార్పొరేషన్లలో కొన్నింటి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదని మంత్రి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కొన్ని పురపాలక సంఘాల్లో వచ్చే ఆదాయం కనీసం వాటి నిర్వహణకు కూడా సరిపోవడం లేదన్నారు. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీల అభివృద్ధికి హాడ్కో (HUDCO) సహకారం తీసుకోవడం ఎంతో కీలకమని, ఆస్తుల ద్వారా కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తామని వెల్లడించారు.
మాస్టర్ ప్లాన్ రోడ్డు నిర్మాణంలో అటవీ భూముల అడ్డంకిని తొలగించేందుకు సంబంధిత అధికారులతో చర్చిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సెంటు భూమి పంపిణీలో అవకతవకలు జరిగాయని, దీనిపై ప్రస్తుతం విజిలెన్స్ విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు. అయితే విచారణ జరుగుతున్నప్పటికీ.. అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ముందుకు తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు.
Also Read: కుక్కలా మొరుగుతున్న బాలుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!