Moinabad Drug Case: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్హౌజ్లో వెలుగుచూసిన కొకైన్ పార్టీ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో పోలీసులకు చిక్కిన వారిలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అలాగే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ సహా పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు ఉన్నారు. ప్రాథమిక పరీక్షల్లో రోహిత్ రెడ్డితో పాటు ఎంపీ పుట్టా మహేష్ కు కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ అని తేలడం కలకలం రేపుతోంది.
ఈ డ్రగ్స్ కేసుపై టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. ఆదివారం ఉదయం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ కేసులో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఈగల్స టీం తన కర్తవ్యాన్ని నిర్వహిస్తోందని.. దీనిలో ఎలాంటి రాజకీయం లేదని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో కేటీఆర్ ఆయన అనుచరులు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మహేశ్కుమార్ గౌడ్ ఆరోపించారు. నిజంగా నిర్దోషులైతే కేటీఆర్ డ్రగ్స్ పరీక్షలకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరం డ్రగ్స్ టెస్టులు చేయించుకున్న తర్వాతే సభలోకి వెళ్దామని ఆయన ప్రతిపాదించారు.
తెలంగాణను డ్రగ్స్ మహమ్మారి నుండి విముక్తి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ కొనియాడారు. ప్రభుత్వ ప్రయత్నాలకు ప్రతిపక్షాలు సహకరించాలి తప్ప దర్యాప్తును నిర్వీర్యం చేసేలా వ్యవహరించవద్దని హితవు పలికారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్ సంస్కృతిని ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు. ఈగల్ టీమ్ దాడులను తప్పుబట్టడం అంటే నేరస్థులను వెనకేసుకురావడమేనని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న ఈ విచారణలో నిజాలు నిగ్గు తేలాలని ఆయన ఆకాంక్షించారు.
మరోవైపు గాంధీభవన్ వద్ద ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ నిరసన చేపట్టాయి. ‘నో డ్రగ్స్.. సేవ్ తెలంగాణ’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా బల్మూరి వెంకట్ మాట్లాడుతూ కేటీఆర్ అలాగే పైలట్ రోహిత్ రెడ్డిలపై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతిని పెంచి పోషించింది బీఆర్ఎస్ నాయకులేనని మండిపడ్డారు. డ్రగ్స్ కేసులో ఉన్న ప్రముఖులందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కేసు విచారణలో ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా పోలీసులు ముందుకు సాగాలని కాంగ్రెస్ నేతలు విన్నవించారు.
Read Also: YSRCP vs TDP: టీడీపీని ఇరికించిన ఎంపీ.. వైసీపీ చేతికి మరో అస్త్రం.. ఔరా హతవిధి!