పిల్లలకు జ్వరం వస్తే చాలామంది తల్లిదండ్రులు జలుబు, దగ్గు లేదా వైరల్ ఇన్ఫెక్షన్ అని అనుకుంటారు. అయితే దగ్గు, జలుబు వంటి లక్షణాలు లేకుండానే తరచూ జ్వరం వస్తుంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (యూటిఐ ) కూడా కారణం కావచ్చునని హైదరాబాద్ యశోద హాస్పిటల్స్కు చెందిన సీనియర్ యూరాలజిస్ట్ డాక్టర్ కౌశిక్ అమంచర్ల చెప్పారు. పిల్లల్లో కనిపించే సాధారణ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఒకటి. ముఖ్యంగా చిన్న పిల్లల్లో జ్వరం ఒక్కటే ప్రధాన లక్షణంగా కనిపించవచ్చు.
మూత్రనాళాలు, మూత్రాశయం, కిడ్నీలు, లేదా మూత్ర విసర్జన నాళంలో అంటే మూత్ర వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్ని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (యుటిఐ) అంటారు.
పెద్ద పిల్లలు మూత్రం పోసేటప్పుడు నొప్పి లేదా మంట ఉందని చెప్పగలరు. కానీ శిశువులు, చిన్న పిల్లలు తమ అసౌకర్యాన్ని వివరించలేరు. అందువల్ల వైద్యులు కూడా మొదట వైరల్ జ్వరం అని భావించే అవకాశం ఉంటుంది. అందుకే స్పష్టమైన కారణం లేకుండా పదే పదే జ్వరం వస్తే తప్పకుండా మూత్ర పరీక్ష చేయించాలి.
జ్వరం ప్రధాన లక్షణమే అయినప్పటికీ మరికొన్ని సంకేతాలు కూడా కనిపించవచ్చు. శిశువులు సరిగా పాలు తాగకపోవడం, ఎక్కువగా ఏడవడం లేదా చిరాకుగా ఉండడం కనిపిస్తుంది. కొందరికి కారణం లేకుండా వాంతులు అవుతాయి. పిల్లలు చాలా అలసటగా ఉండవచ్చు లేదా ఎప్పుడూ నిద్రపోతూ ఉండవచ్చు. మూత్ర విసర్జన తరువాత దుర్వాసన రావడం, పొత్తికడుపు నొప్పి, చిన్న పిల్లల్లో బరువు సరిగా పెరగకపోవడం, మూత్ర విసర్జన అలవాట్లలో మార్పులు కూడా కనిపించవచ్చు. ఈ లక్షణాలు జ్వరంతో కలిసి కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
తరచూ వచ్చే జ్వరానికి కేవలం సాధారణ జ్వరం మందులు మాత్రమే ఇవ్వడం సరిపోదు. కొన్ని సందర్భాల్లో యాంటీబయాటిక్ చికిత్స అవసరం కావచ్చు. జ్వరం మళ్లీ మళ్లీ రావడం, మందులు వాడినా తగ్గకపోవడం, దగ్గు లేదా జీర్ణకోశ సమస్యలు లేకపోవడం, మూత్రానికి సంబంధించిన లక్షణాలు కనిపించడం లేదా గతంలో యుటిఐ రావడం వంటి పరిస్థితుల్లో వెంటనే వైద్య పరీక్షలు చేయించాలి.
మూత్రపిండాలు లేదా మూత్రనాళాల్లో పుట్టుకతో సమస్యలు ఉన్న పిల్లలకు యుటిఐ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వెసికోయూరెటరల్ రిఫ్లక్స్ అనే సమస్య ఉన్నప్పుడు మూత్రం తిరిగి మూత్రపిండాల వైపు వెళ్లి ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. మలబద్ధకం లేదా మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాకపోవడం కూడా బ్యాక్టీరియా పెరగడానికి అనుకూల పరిస్థితులను కల్పిస్తుంది. గతంలో యుటిఐ వచ్చిన పిల్లల్లో మళ్లీ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.
మూత్రాశయంలో ప్రారంభమైన ఇన్ఫెక్షన్ చికిత్స ఆలస్యమైతే మూత్రపిండాలకు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల మూత్రపిండాల్లో మచ్చలు ఏర్పడటం, పనితీరు తగ్గడం, భవిష్యత్తులో అధిక రక్తపోటు లేదా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి తొందరగా చికిత్స ప్రారంభించడం చాలా ముఖ్యం.
Also Read: జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయవచ్చా? వైద్యులు చెప్పిన సరైన విధానం ఇదే
వైద్యులు ముందుగా మూత్ర పరీక్ష చేస్తారు. ఈ పరీక్ష ద్వారా బ్యాక్టీరియా, తెల్ల రక్తకణాలు, ఇన్ఫెక్షన్ సంకేతాలను గుర్తిస్తారు. అవసరమైతే యూరిన్ కల్చర్ చేసి ఏ బ్యాక్టీరియా కారణమో తెలుసుకుంటారు. తరచూ ఇన్ఫెక్షన్ వచ్చే పిల్లలకు అల్ట్రాసౌండ్ వంటి స్కాన్లు కూడా సూచించవచ్చు.
పిల్లలకు తగినంత నీరు తాగించడం చాలా అవసరం. సమయానికి మూత్ర విసర్జన చేసే అలవాటు నేర్పాలి. ఎక్కువసేపు మూత్రాన్ని ఆపకుండా చూడాలి. మలబద్ధకాన్ని వెంటనే తగ్గించే చర్యలు తీసుకోవాలి. మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత పరిశుభ్రత పాటించడం కూడా చాలా ముఖ్యం. జ్వరం పదే పదే వస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.
Also Read: అస్తమా ఉన్నవారు వర్షాకాలంలో వీటికి దూరంగా ఉండాలి.. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం