Sarpanch Election: సర్పంచి ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. నామినేషన్ తిరస్కరణ భయంతో ఆ కుటుంబంలో భార్యా,భర్త , కుమారుడు ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. చివరకు ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ముగ్గురికి మూడు గుర్తులు కూడా కేటాయించారు. కానీ ప్రస్తుతం తండ్రిని గెలిపించుకోవాలని కొడుకు, భర్తను గెలిపించుకోవాలని భార్య, ఇలా ఒకే గుర్తుపై ముగ్గురు కలిసి వినూత్న ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పదవి బీసీ జనరల్ కావడంతో.. ఈ గ్రామంలో 12 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. ఈ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సర్పంచి బరిలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామానికి చెందిన పుల్ల సాయ గౌడ్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు. గత సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ వేసిన సాయ గౌడ్కు పలు కారణాలతో నామినేషన్ తీరస్కరణకు గురైంది.
దీంతో ముందు జాగ్రత్తగా తన భార్య పుష్పలత, కుమారుడు వెంకటేష్తో, కూడా నామినేషన్ వేయించాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం గ్రామంలో సర్పంచ్ స్థానానికి వేలం వేస్తుందని ఆరోపణలు రావడంతో.. ఎన్నికల అధికారులు గ్రామంలో వీడీసీ సభ్యులకు సర్పంచ్ అభ్యర్థి సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసుకొని.. వారికి ఎన్నికపై అవగాహన కల్పించారు. ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగానే నిర్వహిస్తామని నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు ఎవరికి అవకాశం కల్పించడం లేదంటూ అధికారులు తేల్చి చెప్పారు. నామినేషన్లు ఉపసంహరించుకుందామని అధికారుల వద్దకు వెళ్తే జగ్గాసాగర్ గ్రామంలో అభ్యర్థుల ఉపసంహరణ లేదని, అధికారులు తేల్చి చెప్పారు. దీంతో గ్రామంలో నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ పోటీలోని ఉండిపోవాల్సి వచ్చింది.
మిగతా అభ్యర్థులతోపాటు పుల్ల సాయి గౌడ్ కుటుంబంలోని ముగ్గురు సభ్యులు బరిలో నిలబడాల్సి వచ్చింది. అధికారులు వీరికి గుర్తులు కూడా కేటాయించారు. భార్యా పుష్పలతకు టీవీ రిమోటు, కుమారుడు వెంకటేష్కు టూత్ పేస్ట్, సాయ గౌడ్కు స్పానర్ (పానా) గుర్తులను అధికారులు కేటాయించారు.
ఏమి చేయలేని సాయి గౌడ్ కుటుంబం ఆలోచనలో పడ్డారు. సమయం తక్కువ ఉండడంతో ముగ్గురు కలిసి ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ముందుగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసుకుని అనంతరం గ్రామంలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఓటర్లను కలుస్తూ సాయ గౌడ్ భార్య పుష్పలత బొట్టు పెడుతుంటే.. సాయి గౌడ్ తన గుర్తులను చూపిస్తూ ఒకసారి నాకు అవకాశం కల్పించాలని కోరుతుంటే.. కుమారుడు వెంకటేష్ బ్యాలెట్ పత్రంలో గుర్తును వరుస సంఖ్యను చూపిస్తూ.. ఇలా ముగ్గురు కలిసి ఒకే గుర్తుపై విస్తృత ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.
Also Read: తీన్మార్ మల్లన్న ఇంటి వద్ద హై టెన్షన్.. మోహరించిన పోలీసులు
కుటుంబ సభ్యులు ముగ్గురు కలిసి చేస్తున్న ప్రచారం ఓటర్లను ఆలోచింపజేస్తుంది. ఏది ఏమైనా అధికారుల తీరుతో ఆ ఇంట్లో ముగ్గురు కలిసి ఒకే గుర్తుపై ప్రచారం చేయడం అందరిని ఆకట్టుకుంటుంది.