హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారం గులాబీ పార్టీకి తలనొప్పిగా మారింది. ఒకటి పోతే మరొకటి అన్నట్టుగా ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు, చేష్టలు చేయడం ఆయనకు పరిపాటిగా మారింది. ఇటీవల కరీంనగర్ సీపీతో ఆయన వైరం పెట్టుకున్నారు. ఆయన్ను మతం పేరిట దూషించడం, ఏపీఎస్ల సంఘం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో చివరకు క్షమాపణలు చెప్పారు. అది ఇప్పటికీ నడుస్తున్నది.తాజాగా అసెంబ్లీలో నిన్న బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపడుతుండగా.. కారు పార్టీలో గెలిచి ఫిరాయింపులకు పాల్పడిన స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రిపై ఆయన వివాదాస్పద సైగలు చేసినట్టు చేశారు. దానిపై కాంగ్రెస్ పార్టీతీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది.
కౌశికరెడ్డి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇలాగే వరుసగా వివాదాల్లో ఇరుక్కోవడం ఆయన స్టైల్ అని ప్రచారం జరుగుతోంది. కొంతకాలం సీఎం రేవంత్ రెడ్డి, ఆ తర్వాత మంత్రులను ఆయన టార్గెట్ చేశారు. తాజాగా అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బర్తరఫ్ చేయడంతో పాటు రాఘవ కన్ స్ట్రక్షన్ మీద హౌస్ కమిటీ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని గులాబీ పార్టీ నేతలు నిన్న డిమాండ్ చేశారు. అనంతరం కడియం శ్రీహరి మాట్లాడేందుకు నిల్చుకున్నారు. దీంతో ఆయన్ను చోర్ చోర్ అని బీఆర్ఎస్ నేతలు కాసేపు ర్యాగింగ్ చేశారు. అనంతరం ఆయన ఏదో మాట్లాడుతుండగా.. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశికరెడ్డి సభలో లేచి నిల్చున్నారు. చేతుల ద్వారా సైగలు చేస్తూ గన్తో కాల్చి పడేస్తాం అన్నట్టుగా సైగలు చేసినట్టు తెలిసింది.
కౌశికరెడ్డి సైగలను గమనించిన కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఫిర్యాదు చేశారు. ఆయన మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఎం రేవంత్ కలుగజేసుకుని స్పీకర్తో మాట్లాడారు. సభా మర్యాదకు, దళిత ఎమ్మెల్యే పట్ల అనుచితంగా ప్రవర్తన, అసభ్యకర సైగలు చేసినందుకు ఆయన మీద కఠిన చర్యలకు సీఎం ఆదేశించారు. అనంతరం వెంటనే బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు కలుగజేసుకోవడం, ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని అనడంతో సీఎం ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేశారు. దీంతో స్పీకర్ ఎథిక్స్ కమిటీకి కౌశికరెడ్డి వ్యవహారాన్ని అప్పగించారు.ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కౌశికరెడ్డిపై స్పీకర్ చర్యలు తీసుకోనున్నారు.
మహాలక్ష్మి పదివేల కోట్ల మైలురాయి.. తెలంగాణ ఆడబిడ్డల అకౌంట్లలో పొదుపు సిరి!
కాగా, కౌశిక రెడ్డి వ్యవహారం మొత్తంగా బీఆర్ఎస్ మెడకు చుట్టుకున్నట్టు అయ్యింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు నోరు దగ్గర పెట్టుకోకపోవడంతో అది కాస్త ప్రతిపక్ష పార్టీకే నష్టం కలిగించనుంది. మొత్తానికి హరీశ్ రావు సూచన మేరకు రేవంత్ రెడ్డి ఎథిక్స్ కమిటీకి ఆయన వ్యవహరాన్ని పంపారు. దళితుడిని అవమానిచండం ఆపార్టీకి ముందు నుంచి అలవాటే అని సీఎం రేవంత్ సభా వేదికగా తీవ్రవిమర్శలు చేశారు. గతంలో దళితుడిని సీఎం చేస్తామని కేసీఆర్ మాట మార్చారని, మూడు ఎకరాల భూమి ఇవ్వలేదని.. ఆ తర్వాత దళితుడికి డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చి మూడు నెలలలోపే ఆయన్ను బర్తరఫ్ చేసి అవమానించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల పట్ల కమిట్మెంట్తో ఉన్నదని, అందుకే తాము స్పీకర్, డిప్యూటీ సీఎం పదవులను దళితులకే కట్టబెట్టామని సీఎం వెల్లడించారు. సీఎం వ్యాఖ్యలతో బీఆర్ఎస్ నేతల్లో ఒక్కసారిగా మౌనం నెలకొన్నది. దళితుడిని అవమానించి మొత్తానికి ఉన్న మైలేజ్ను పొగొట్టుకున్నదని ప్రచారం జరుగుతోంది.