Kavitha On SPB: ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం తెలంగాణ పాట పాడటానికి నిరాకరించారు అంటున్నారు, ఎంతవరకు నిజమో తెలీదంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదం కొనసాగుతోంది. ఈ వివాదంపై కవిత స్పందిస్తూ.. తెలంగాణ వాదులు రవీంద్ర భారతిలో ఎస్పీబీ విగ్రహాన్ని ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమ గీతమైన “జయ జయహే తెలంగాణ”ను పాడటానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిరాకరించారన్నారు. అందుకే ఆయన విగ్రహం రవీంద్ర భారతిలో పెట్టడాన్ని తెలంగాణ వాదులంతా వ్యతిరేకిస్తున్నారన్నారు.
ఈ విషయంలో తెలంగాణ వాదులకు తన సపోర్టు ఉంటుందని కవిత ప్రకటించారు. ఎస్పీ బాలు విగ్రహం పెట్టుకోడానికి ఇంకెక్కడైనా ప్లేస్ చూడడం మంచిదని కవిత సూచించారు. రవీంద్ర భారతిలో కేవలం తెలంగాణ కళాకారుల విగ్రహాలు మాత్రమే పెట్టాలని కవిత సూచించారు. ఈనెల 15న ఎస్పీ బాలు విగ్రహవిష్కరణ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో కవిత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Also Read: Vikarabad News: వికారాబాద్ జిల్లాలో భారీ గంజాయి పట్టివేత.. ముగ్గురి అరెస్ట్
“బాల సుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడానికి ఇంకేమైనా మంచి ప్లేస్ చూసుకోండి. తెలంగాణ కళాకారుల విగ్రహాలను రవీంద్రభారతిలో పెడితే బాగుంటుంది. ఎందుకంటే రవీంద్ర భారతిలో అంతకు ముందు తెలంగాణ కళాకారులకు చోటులేదనే ఆవేదన ఉంది. తెలంగాణ వచ్చాక అన్ని జానపదకళలను అక్కడ ప్రదర్శనలు చేయడానికి ప్రయత్నం చేశాము. తెలంగాణ తేజోమూర్తుల చిత్రపటాలను అక్కడ పెట్టడానికి ప్రయత్నం చేశాము. అటువంటి చోటులో సినిమా కళాకారుడైన ఎస్పీ బాలు విగ్రహం పెట్టడం సరికాదని నా అభిప్రాయం. సినిమా కళాకారుల విగ్రహాల కోసం ప్రసాద్ స్టూడియోస్ ఉన్నాయి. విగ్రహాలు పెట్టొద్దని నేను అనడంలేదు కానీ రవీంద్ర భారతిలో మాత్రం తెలంగాణ జానపద కళాఖారులకు చోటు ఉండాలనేది నా అభిమతం” – కల్వకుంట్ల కవిత