Kavitha New party: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) తనయ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kalvakuntla Kavitha).. కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) పేరుతో కొత్త పార్టీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు, శ్రేణులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. తన పార్టీ స్థాపించడానికి గల కారణాలు చెబుతూనే.. బీఆర్ఎస్ పార్టీ, తన తండ్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మన మనిషి కాదని.. మర మనిషిగా మారిపోయారంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబాన్ని కూడా కాదని బీఆర్ఎస్ కోసం తన రక్తం, చెమట, సమయాన్ని వెచ్చించాని పేర్కొన్నారు. ఒకప్పుడు తెలంగాణ చేనేత కార్మికులు చనిపోతే భిక్షాటన చేసిన కేసీఆర్.. ఇవాల్టి రోజున ప్రజలు కష్టాలు పట్టని మరమనిషిగా మారిపోయారని ఆమె విమర్శించారు. ప్రజలకు కష్టం వస్తే సారు రారని మండిపడ్డారు. గుంట నక్కలు, తోడేళ్ల చేతిలో ఖైదీ అయిన మనిషి కేసీఆర్ అంటూ కవిత విరుచుకుపడ్డారు.
కేసీఆర్ మన మనిషి కాదు.. మర మనిషి: కవిత
నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో తెలంగాణ తెచ్చుకున్నాం
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటి కోసం రూ.లక్షా 89 వేల కోట్లు ఖర్చు చేసి 14 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారు
కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల కోసం రూ. లక్షా 20 వేల కోట్లు ఖర్చు చేసి కేవలం లక్ష… pic.twitter.com/gtDLYrfvWZ
— BIG TV Breaking News (@bigtvtelugu) April 25, 2026
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటి కోసం రూ.లక్షా 89 వేల కోట్లు ఖర్చు చేసి 14 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారని కవిత గుర్తుచేశారు. అయితే ఒక్క కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల కోసం రూ.లక్షా 20 వేల కోట్లు ఖర్చు చేసి.. కేవలం లక్ష ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారని కవిత విమర్శించారు. తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉండి ఉంటే కుర్చీ వేసుకొని మరీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ కట్టించేవారని కవిత అన్నారు. మారిన కేసీఆర్ జాతీయ పార్టీ పెడతానంటూ పంజాబ్, గుజరాత్, బిహార్ కు వెళ్లారని.. తెలంగాణను పట్టించుకోలేదని మండిపడ్డారు. కేంద్రంతో గొడవ పెట్టుకోకుండా ఉండి ఉంటే పాలమూరు ఈపాటికి పూర్తయ్యేదని కవిత అభిప్రాయపడ్డారు. ఒకనాడు తెలంగాణ బిడ్డల కోసం కొట్లాడిన వ్యక్తికి.. రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ ప్రేమ ఏమైందంటూ నిలదీశారు. అధికారం ముందు మమకారం తగ్గిపోయిందా అంటూ ప్రశ్నించారు.
Also Read: కేసీఆర్ ఉద్యమ రథ చక్రం విరిగింది.. ఆయన ఫ్యామిలీలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా.. కవిత సంచలన వ్యాఖ్యలు
కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పినందుకే తనను పార్టీ నుంచి గెంటేశారని కవిత విమర్శించారు. అవినీతి చేసిన పందికొక్కులను మాత్రం పక్కన కూర్చోబెట్టుకున్నారని కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కేసీఆర్ ఆత్మలేని మరబొమ్మ అంటూ కవిత ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ ఉద్యమ రథం దారి తప్పిందన్న కవిత.. సామాజిక రథ చక్రం విరిగి ముక్కలైందంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. మనం కోరుకున్న తెలంగాణ ఇంకా రాలేదని.. దానిని సాధించే దిశగా తన కొత్త టీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తుందని స్పష్టం చేశారు.
మరోవైపు బీజేపీ పార్టీపై సైతం కవిత తీవ్ర విమర్శలు చేశారు. అసలు ఆ పార్టీకి తెలంగాణ రావడమే ఇష్టం లేదని ఆరోపించారు. తల్లిని చంపి బిడ్డను తీశారని.. బీజేపీ పెద్దలు అంటుంటారని గుర్తుచేశారు. మెడకాయ మీద తలకాయ లేని ఒక ఎంపీ తెలంగాణను భారత్ పాక్ విభజనతో పోల్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రనాయకత్వం అలా మాట్లాడితే బీజేపీ బానిస ఎంపీలు ఒక్క మాట మాట్లాడకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు. తెలంగాణకు ఒక్క రూపాయి నిధులు ఇవ్వకపోయినా.. బీజేపీ ఎంపీలు మాట్లాడరని ఎద్దేవా చేశారు. సామాజిక న్యాయం అనే దానికే బద్ద వ్యతిరేకి బీజేపీ అంటూ విమర్శలు గుప్పించారు.
మహిళా బిల్లు, బీసీ బిల్లు, కలగణన బిల్లును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొక్కిపెట్టిందని కవిత ఆరోపించారు. పేదలకు కూడు పెట్టే ఉపాధి హామీని పక్కన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫెడరల్ స్ఫూర్తిని పక్కన పెట్టి.. ఖమ్మం జిల్లాలో మన ఏడు మండలాలు తీసుకున్నారని విమర్శించారు. అయిన సరే ఈ బీజేపీ బానిస ఎంపీలు పెదవులు తెరవరలేదని అన్నారు. ‘మీరు తెలంగాణ బిడ్డలైతే భద్రాచలం వద్ద 5 గ్రామాలను తెలంగాణకు పట్టుకురండి’ అంటూ బీజేపీ ఎంపీలకు కవిత సవాలు విసిరారు. పోలవరం పూర్తయితే ఆ గ్రామాలు మునిగిపోతాయని చెప్పారు.
Also Read: కొత్త పార్టీ.. కొత్త లక్ష్యం.. తెలంగాణ సీఎంని అవుతానంటున్న కవిత