తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సమస్యలు ఒక్కొక్కటిగా వెంటాడుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని, మరో జయలలిత కావాలని ఆమె అనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది..ఈ క్రమంలోనే ఉగాది రోజున కొత్త పార్టీని ప్రకటిస్తానని ఇదివరకే ప్రకటించారు.కానీ,కొన్ని అనుకోని కారణాల వలన ఆమె పార్టీ ప్రకటన ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే పార్టీ పేరు రిజస్ట్రర్ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ఆమె దరఖాస్తు చేసుకోగా కొన్ని టెక్నికల్ సమస్యల వలన పార్టీ పేరు రిజిస్ట్రేషన్ ఇంకా పెండింగ్లోనే ఉన్నట్టు తెలుస్తున్నది. దీంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు తెలుస్తున్నది.
బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత బయటకు వచ్చి ఆరు నెలలు కావొస్తుంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో తన కంటూ ఓ పొలిటికల్ మైలేజీ కోసం ఆమె పోరాటాలు చేస్తున్నారు. ఓవైపు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే మరోవైపు ప్రజాసమస్యలపైనా ప్రశ్నిస్తున్నారు. ఇటీవల భూదాన్ భూముల వ్యవహారంలో బాధితుల పక్షాన కవిత సర్కారును ప్రశ్నించారు. ఖమ్మంలో ధర్నాకు దిగారు. అనంతరం హైదరాబాద్లోనూ అదే పంథాను కొనసాగించారు. మూసీ బాధితుల పక్షానా ఆమె తన గళం వినిపించారు. సర్కారు ముందుగా ఆరు గ్యారంటీలు అమలు చేయాలని, ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాకే బాధితుల ఇండ్ల జోలికి వెళ్లాలని డిమాండ్ చేశారు. పేదల పక్షాన పోరాటంలో భాగంగా కవిత అరెస్టు అయ్యి మరల బయటకు వచ్చారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేశారని పేర్కొంటూ 23 మందికి రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో కల్వకుంట్ల కవిత, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ సైతం ఉన్నారు. అయితే, ఈ కేసు ఇంతటితో ముగిసిపోయిందని, కవిత అసలు ఏ నేరం చేయలేదని అంతా నమ్ముతున్న వేళ సీబీఐ ఈ కేసును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోర్టును సీబీఐ కోరింది. లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న వారు బయట ఉంటే సాక్ష్యులు, సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని సీబీఐ వాదనలు వినిపించడంతో తమ ఎదుట హాజరు కావాలని ఢిల్లీ హైకోర్టు సీబీఐ ద్వారా కల్వకుంట్ల కవితకు నోటీసులు పంపించింది. దీనిపై ఆమె న్యాయసలహా తీసుకుంటున్నట్టు తెలిసింది.
‘తెలంగాణ ప్రజా జాగృతి’ అనే పేరును.. కవిత తాను పెట్టబోయే పార్టీకోసం ఖరారు చేసినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం పంపగా.. కేంద్రం ఎన్నికల సంఘం జాప్యం చేయడంపై ఆమె తాజాగా రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ పేరు రిజిస్ట్రేషన్ ప్రక్రియను కావాలనే ఈసీ ఆలస్యం చేస్తున్నదని, దీనిపై చర్యలకు ఆదేశించాలని పిటిషన్లో ఆమె పేర్కొనట్టు తెలిసింది. ఇదిలాఉండగా, కవిత బీఆర్ఎస్ పార్టీలో రీజాయిన్ అయ్యే అవకాశాలు సైతం లేకపోలేదని టాక్ వినిపిస్తోంది. కొత్త పార్టీ ప్రకటన అనేది రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరం లేదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో షర్మిల పార్టీ పెట్టి మరల ఏపీకి వెళ్లిపోయి కాంగ్రెస్లో చేరిన విధంగానే.. కవిత సైతం తిరిగి కారు పార్టీలో చేరే అవకాశాలు లేకపోలేవని.. ప్రజలు కొత్త పార్టీపై ఆసక్తిగా లేరని చర్చ జరుగుతున్నది.దీంతో ఆమె కొత్త పార్టీ పెట్టినా ప్రజలు ఆదరిస్తారా? అనే అనుమానాలు నెలకొన్నాయి. కొత్త పార్టీ ద్వారా బీఆర్ఎస్ను టార్గెట్ చేయాలని కవిత చూస్తున్నదని ప్రచారం జరుగుతుండగా.. ఆదిలోనే ఇబ్బందులు ఎదురవ్వడంతో ఏం చేయాలో తోచని స్థితిలో కవిత ఉన్నట్టు తెలుస్తున్నది.