Second Hand Mobile: స్వేచ్చ బ్యూరో: సెకండ్హ్యాండ్ మొబైల్ ఫోన్ల కొనుగోలు లేదా ఎక్స్చేంజ్ సమయంలో విక్రేత ఆధార్ కార్డుతో పాటు పూర్తి వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే మొబైల్ షాపుల యజమానులకు సూచించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మొబైల్ షాపులు, మొబైల్ రిపేర్ షాపుల యజమానులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను విక్రయించేందుకు వచ్చే వారిపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వచ్చిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని సూచించారు.
మొబైల్ దొంగలను పట్టించడంలో లేదా వారి ఆచూకీ పోలీసులకు అందించడంలో సహకరించిన మొబైల్ షాపు యజమానులకు జిల్లా పోలీసుల తరఫున ప్రశంసాపత్రం అందజేస్తామని ఎస్పీ తెలిపారు. సెకండ్హ్యాండ్ మొబైల్ కొనుగోలు చేసే వినియోగదారులు తప్పనిసరిగా బిల్లు లేదా రసీదు తీసుకోవాలని సూచించారు. తక్కువ ధరకు లభిస్తుందనే ఆశతో దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను కొనుగోలు చేస్తే చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, దొంగిలించబడిన మొబైల్ అని తెలిసి కూడా కొనుగోలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొబైల్ విక్రయించాలనుకునే వారు సంబంధిత కంపెనీల అధికారిక ఎక్స్చేంజ్ కేంద్రాలు లేదా చట్టబద్ధమైన విక్రయ కేంద్రాల ద్వారానే విక్రయించాలని, అనధికారిక వ్యక్తులు లేదా షాపులకు విక్రయించవద్దని సూచించారు.
Also read: Construction Waste: హైదరాబాద్లోని ఐటీ కారిడార్లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్ఫుల్..?
దొంగిలించబడిన మొబైల్ ఫోన్లు సైబర్ నేరాలకు వినియోగించే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. అందరి సహకారంతోనే మొబైల్ ఫోన్ల రికవరీలో దక్షిణ భారతదేశంలో మొదటి స్థానం, తెలంగాణ రాష్ట్రంలో వరుసగా మూడో ఏడాది తొలి స్థానం సాధించామని ఎస్పీ తెలిపారు. మొబైల్ పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా వెంటనే సిఈఐఆర్ పోర్టల్లో బ్లాక్ చేసి, సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఐటీ కోర్ ఎస్ఐ కిరణ్ కుమార్, కానిస్టేబుల్ రాజా తిరుమలేష్తో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న మొబైల్ షాపుల యజమానులు పాల్గొన్నారు.
Also read: సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!