KCR Farmhouse: ఎర్రవల్లి, శివారు వెంకటపూర్, వరదరాజుపూర్.. ఈ మూడు గ్రామాల భూముల్లో అధికారుల పరిశీలన మొదలైంది. సరిహద్దుల్లోని అసైన్డ్ భూములపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా 325 సర్వే నెంబర్లోని అసైన్డ్ భూమిని అధికారులు పరిశీలిస్తున్నారు. ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంది? అందులో ప్రభుత్వ భూమి ఎంత? పట్టా భూమి ఎంత? అనే వివరాలన్నీ సేకరిస్తున్నారు. అసైన్డ్ భూమి కబ్జాలో ఎవరెవరున్నారన్న వివరాలను కూడా రాబడుతున్నారు. మొత్తం 385 ఎకరాల భూమిలో ఎంత భాగం కబ్జాకు గురైందో లెక్క తేల్చనున్నారు అధికారులు. దీనంతటికీ.. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వేదికగా బయటపెట్టిన భూముల లెక్కలే కారణం. కేసీఆర్ ఫామ్హౌస్లో ప్రభుత్వ భూమి కబ్జా అయిందని శాసనసభలో చెప్పారు. అందులో.. ప్రభుత్వ భూమి ఉందా? లేదా? అన్నది 30 రోజుల్లోగా తేల్చాలని అధికారులను ఆదేశించారు.
వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి..?
పదేళ్ల పాలనలో కేసీఆర్కు లక్షల కోట్లు వచ్చాయని ఆరోపించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. 2004 వరకు ఎకరా భూమి కూడా లేదని ఎన్నికల అఫిడవిట్లో తెలిపిన కేసీఆర్కు.. ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయన్నారు. ఎన్నికల అఫిడవిట్తో అడ్డంగా దొరికిపోయారన్నారు. ఉద్యమకారుల త్యాగాల పునాదుల పై లక్షల కోట్ల ఆస్తులు సంపాదించారని పొంగులేటి విమర్శించారు. పుట్టుకతోనే కేసీఆర్కు వందల ఎకరాలు ఉన్నాయని కేటీఆర్ చెబుతున్నారని.. అలాంటప్పుడు అఫిడవిట్లో తప్పులు రాశారా? లేక ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారా? అని ప్రశ్నించారు. మరో వైపు.. మాజీ సీఎం కేసీఆర్కు సంబంధించిన భూముల వివరాలను.. రెవెన్యూ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఫామ్ హౌస్ సమీపంలోని ప్రభుత్వ భూముల సర్వే నెంబర్లు, గతంలో ఉన్న రైతుల పేర్లు, ప్రస్తుత రికార్డులతో.. రిపోర్ట్ రెడీ చేస్తున్నారు. ప్రభుత్వ భూమిగా తేలితే.. స్వాధీనం చేసుకుంటామని సర్కార్ చెబుతోంది. ఆ భూములను ప్రజలకు పంచుతామని అసెంబ్లీలోనే ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. 30 రోజుల్లోనే ఏం తేలుతుందనేది.. ఉత్కంఠగా మారింది.
Also Read: యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య.. ఆమె హత్యకు ప్రతీకారం?