Adi Srinivas: స్వేచ్ఛ బ్యూరో: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తావించిన భూముల వ్యవహారాలు, డాక్యుమెంట్ నంబర్ 7289 పై తీవ్ర అనుమానాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.బొల్లి రామ్మోహన్కు సంబంధించిన భూ వ్యవహారంలో కేటీఆర్ ప్రస్తావించిన 12-12-2007 నాటి 7289 నంబర్ డాక్యుమెంట్ తీవ్ర అనుమానాస్పదంగా ఉందని, దీనిపై సమగ్ర అధికారిక విచారణ జరిపి వాస్తవాలు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.గురువారం విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. సిరిసిల్ల సబ్రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆశ్రయించి తాము ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించినట్లు విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు.2007 31 డిసెంబర్ 2007 నాటికి ఆ సంవత్సరంలో నమోదైన చివరి బుక్ డాక్యుమెంట్ నంబర్ 5777 అని, కానీ 12-12-2007 తేదీతో 7289 నంబర్ డాక్యుమెంట్ ఎలా సాధ్యమవుతుందో కేటీఆర్, బొల్లి రామ్మోహన్లు సమాధానం చెప్పాలని ప్రభుత్వ విప్ డిమాండ్ చేశారు. ఈ డాక్యుమెంట్ అసలు రిజిస్ట్రేషన్ రికార్డుల్లో ఉందా? దాని వాల్యూమ్, బుక్, పేజీ నంబర్ , స్కాన్ రికార్డులను రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు పరిశీలించాలని కోరారు.
ప్రభుత్వ భూముల కబ్జాలపై విచారణ
బొల్లి రామ్మోహన్కు చెందిన సుమారు 2 ఎకరాల 30 గుంటలు మరియు మరో 5 ఎకరాల భూమిలో ప్రభుత్వ భూమి ప్రమేయం ఉందని, గతంలో ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ కూడా చేపట్టిందని గుర్తుచేశారు. ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల పేర్లపై ఎలా రిజిస్టర్ అయ్యాయి? ఏ పత్రాల ఆధారంగా నమోదయ్యాయో తేల్చాలి.విచారణలో నకిలీ పత్రాలు లేదా అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తేలితే ఫోర్జరీ కేసులు నమోదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆది శ్రీనివాస్ కోరారు. కొండూరు రవీందర్ రావు పేరుపై ఉన్నట్లు చెబుతున్న 14 ఎకరాల 25 గుంటల ప్రభుత్వ భూమిపై ,తోట ఆగయ్య భూములకు సంబంధించిన పాత కేటాయింపు రికార్డులను కూడా పరిశీలించి, అవి ప్రభుత్వ భూములైతే స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని ఆది శ్రీనివాస్ కోరారు.
కేటీఆర్ క్షమాపణ చెప్పాలి
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీసుకుంటున్న భూపరిరక్షణ చర్యలను కేటీఆర్ రాజకీయ కక్ష సాధింపుగా వక్రీకరిస్తున్నారని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. ఆధారాలు లేని వ్యాఖ్యలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని, వాస్తవాలకు భిన్నంగా మాట్లాడినందుకు కేటీఆర్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.జిల్లాలోని ప్రభుత్వ, నిషేధిత భూముల రికార్డులను బహిరంగంగా పరిశీలించి, 7289 డాక్యుమెంట్ వెనుక ఉన్న అసలు నిజాలను ప్రజల ముందుకు తీసుకురావాలని అధికారులను కోరారు.
Also Read: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో 2.25 లక్షల మందికి కొత్త పింఛన్లు!