తెలంగాణ ఉద్యమ కాలం నాటి పాత కేసు నుంచి భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ సహా కీలక నేతలకు ఊరట లభించింది. 2011లో నిర్వహించిన సకల జనుల సమ్మె సందర్భంగా నమోదైన కేసును నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ తీర్పుతో సుమారు 15 ఏళ్ల నాటి వివాదానికి తెరపడింది.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అప్పట్లో జేఏసీ పిలుపునిచ్చిన సకల జనుల సమ్మెలో కేసీఆర్, కేటీఆర్, పద్మారావు గౌడ్, శంబీపూర్ రాజు, దాసోజు శ్రవణ్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ క్రమంలో రైలు రోకోలు, రహదారుల దిగ్బంధం వంటి నిరసనలు చేపట్టారు. దీనిపై అప్పట్లో పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు నిందితులపై సరైన ఆధారాలు లేవని అభిప్రాయపడుతూ కేసును కొట్టేసింది.
ఈ కేసు విచారణలో భాగంగా గతంలోనే పలుమార్లు నేతలు కోర్టుకు హాజరయ్యారు. రాజకీయ ప్రేరేపితమైన కేసులుగా వారు వాదనలు వినిపించారు. తాజాగా వెలువడిన తీర్పుపై బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యమకారులపై ఉన్న అక్రమ కేసులన్నీ వీగిపోతాయని నేతలు పేర్కొంటున్నారు.
ALSO READ: KTR: ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలి.. అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లుకు బీఆర్ఎస్ సిద్ధం: కేటీఆర్