Medchal Metro: మేడ్చల్ మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మేడ్చల్ నియోజకవర్గానికి మెట్రో కనెక్టివిటీ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ సర్కార్పై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటైన విమర్శలు గుప్పించారు.
చిత్తశుద్ధి లేని కాంగ్రెస్.. కేంద్ర నిధుల సాధనలో వైఫల్యం
మేడ్చల్ మెట్రో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని కేపీ వివేకానంద విమర్శించారు. మెట్రో విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన నిధులను రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఒకవైపు నిధులు తీసుకురాకుండా, మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో విభేదాలు ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీకి వెళ్తే ఒకరి చేతులు ఒకరు పట్టుకుని కలిసి తిరిగే రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి.. ఇక్కడకు వచ్చేసరికి మాత్రం విభేదాలు ఉన్నట్లు నటిస్తూ రాష్ట్ర ప్రజలను ఘోరంగా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
Also Read: పద్ధతి మార్చుకోకపోతే చెప్పు దెబ్బలు తప్పవు.. వైసీపీ నేతలపై మంత్రి కొల్లు సంచలనం!
ప్రాజెక్టును కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు!
గతంలో ఎల్ అండ్ టీ సంస్థ ఆధ్వర్యంలో నడిచిన మెట్రో ప్రాజెక్టు వ్యవహారాలను కాంగ్రెస్ ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుని, ఇప్పుడు దాన్ని పూర్తిగా కోల్డ్ స్టోరేజ్లో పడేసిందని వివేకానంద ఆరోపించారు. రేవంత్ రెడ్డి గతంలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న కాలంలో ఈ ప్రాంతానికి ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని ఎద్దేవా చేశారు. ఎంపీగా ఉన్నప్పుడే పట్టించుకోని రేవంత్, ఇప్పుడు సీఎంగా ఉండి కూడా మేడ్చల్ పరిధిలోని ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా గాలికొదిలేశారని విమర్శించారు.
మేడ్చల్ మెట్రో కోసం ఉద్యమిస్తాం
మేడ్చల్ ప్రాంత ప్రజల కల అయిన మెట్రో రైలు సాధన కోసం తాము వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కేపీ వివేకానంద స్పష్టం చేశారు. ఈ క్రమంలో ‘మేడ్చల్ మెట్రో రైలు సాధన సమితి’ చేపట్టే పోరాటాలకు, ఉద్యమానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి వెంటనే మెట్రో పనులను ప్రారంభించేలా భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని ఆయన హెచ్చరించారు.