Revanth Reddy: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో బుధవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. యాదగిరిగుట్ట ఆలయ సమగ్ర అభివృద్ధి, పర్యాటక రంగ విస్తరణతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలపై సీఎం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి, కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సహా దేవాదాయ, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట అభివృద్ధికి ‘తిరుమల మోడల్’
యాదగిరిగుట్ట (యాదాద్రి) పుణ్యక్షేత్రాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆలయ భూములు, నిర్మాణాలపై ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్కు మార్కెట్ రేటు ప్రకారమే భూమి కేటాయించాలి. వివిధ మఠాలు, కుల సంఘాలకు స్థలాలు ఇచ్చే అంశంపై స్పష్టమైన నిబంధనలతో కూడిన విధానాన్ని (పాలసీ) రూపొందించాలి. అయితే, భూమిపై శాశ్వత యాజమాన్య హక్కులు మాత్రం టెంపుల్ బోర్డు వద్దే ఉండాలి’. ఈ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయాలని ఆదేశించారు.
Also Read: గన్నవరం బైపాస్పై ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు!
గుట్టపై గెస్ట్ హౌస్ నిర్మాణాలు
గుట్టపై గెస్ట్ హౌస్ల నిర్మాణానికి ముందుకు వచ్చే దాతల జాబితాను సిద్ధం చేసి, విడతల వారీగా అనుమతులు ఇవ్వాలని, ఇందుకు కూడా తిరుమల మోడల్నే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. భూసేకరణ ప్రక్రియ కోసం తక్షణమే నిధులు మంజూరు చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. అలాగే, ఆలయ నిర్మాణంపై ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి, వారం రోజుల్లో తుది నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
పర్యాటక రంగం – హెచ్డీఎఫ్సీ సీఎస్ఆర్ పనులు
యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) పద్ధతిలో అంతర్జాతీయ స్థాయి టూరిజం సర్క్యూట్గా మార్చాలని సీఎం పిలుపునిచ్చారు. ఇదే వేదికపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఎస్ఆర్ (CSR) నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇందులో భాగంగా రెండు సరికొత్త అంబులెన్స్లను జెండా ఊపి ప్రారంభించడమే కాకుండా, భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఎంఆర్ఐ (MRI) మిషన్ను వర్చువల్గా ప్రారంభించారు.
Also Read: బీఆర్ఎస్ లో సర్వే కలకలం.. ఆ లీడర్ల లిస్ట్ రెడీ చేసిన కేటీఆర్.. వారికి నో టికెట్!
మహిళా సంఘాలకు బంపర్ ఆఫర్
మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. స్వయం సహాయక మహిళా సంఘాలు (SHG) తీసుకున్న రుణాలను చాలా క్రమశిక్షణతో తిరిగి చెల్లిస్తున్నాయని ఆయన అభినందించారు. అందుకే మహిళా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా లాజిస్టిక్ పార్కులు, గోడౌన్లు, రైస్ మిల్లులను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని, వీటికి బ్యాంకుల ద్వారా పెద్ద ఎత్తున, విరివిగా రుణాలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.