Telangana High Court: స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ (SIR) ప్రక్రియలో ఉపయోగిస్తున్న దరఖాస్తు ఫారాల్లో భాషకు సంబంధించి దాఖలైన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి హైకోర్టు నిరాకరించింది. ఇతర రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ దరఖాస్తులను ఏయే భాషల్లో ముద్రిస్తున్నారో పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాలపై కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంటూ విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.
కరీంనగర్కు చెందిన సామాజిక కార్యకర్త ముజీబ్ అయూబ్ దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తి విజయ్సేన్రెడ్డి విచారణ జరిపారు. ఎస్ఐఆర్ దరఖాస్తులను కేవలం తెలుగులో అందుబాటులో ఉంచడం వల్ల ఆ భాష తెలియని ఓటర్లు ఇబ్బందులు ఎదురొంటున్నారని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది రఘునాథ్ చెప్పారు. హైదరాబాద్లో ఉర్దూ, ఆంగ్ల భాషలు మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నా వారికి తగిన భాషల్లో దరఖాస్తులు అందుబాటులో లేవని తెలిపారు.
దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియను అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించాయని తెలిపారు. బీఎల్వో వద్ద తెలుగు ఫారాలతోపాటు ఆంగ్లం, ఉర్దూలో నమూనా ఫారాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అవసరమైన వారు వాటిని పరిశీలించి వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు.
Also Read: సూర్యుడితో స్నేహం.. మొబైల్కు ప్రాణం.. అదరగొడుతున్న స్మార్ట్ బెంచీలు!
వాదనలు విన్న న్యాయస్థానం బీహార్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో ఎన్ని భాషల్లో దరఖాస్తులను ముద్రించారో వివరాలు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. 20 శాతం కన్నా ఎక్కువ మంది ఉర్దూ మాట్లాడేవారు ఉంటే ఆ భాషలో దరఖాస్తు ఫారాలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చెయ్యాలని ఆదేశించింది. తదుపరి విచారణను వారం రోజులపాటు వాయిదా వేసింది.
Also Read: క్లీనింగ్ ఇక చాలా ఈజీ.. సోఫాలు, మంచాల కోసం.. బెస్ట్ వ్యాక్యూమ్ క్లీనర్స్!