Raja Singh: స్వేచ్ఛ బ్యూరో: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టి. రాజాసింగ్కు నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టులో భారీ ఊరట లభించింది. గత కొన్ని ఏళ్లుగా సాగుతున్న ఈ కేసు విచారణ ముగియడంతో, మంగళవారం కోర్టు ఆయనపై నమోదైన కేసులన్నింటినీ కొట్టివేస్తూ కీలక తీర్పునిచ్చింది. సాక్ష్యాధారాలు సరిగ్గా లేకపోవడంతో రాజాసింగ్ను నిర్దోషిగా ప్రకటిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.
వివాదం నేపథ్యం ఇదే..
ఈ వివాదానికి మూలాలు 2022 ఆగస్టు నాటి పరిణామాల్లో ఉన్నాయి. అప్పట్లో ప్రముఖ స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ హైదరాబాద్లో ఒక షో నిర్వహించారు. ఈ షోను ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నిరసనలో భాగంగా ఆయన యూట్యూబ్లో ఒక వీడియోను విడుదల చేశారు. అయితే, ఆ వీడియోలో కొన్ని వర్గాలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా రాజాసింగ్ ప్రసంగించారంటూ హైదరాబాద్లోని పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
పీడీ యాక్ట్ నమోదు.. 77 రోజుల జైలు శిక్ష
ఈ ఫిర్యాదుల ఆధారంగా మంగళ్హాట్ పోలీసులు రాజాసింగ్పై ఐపీసీ సెక్షన్లు 153A(a)(b), 295A, 504, 505(2), 506 కింద కేసులు నమోదు చేశారు. అనంతరం 2022 ఆగస్టు 23న ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కానీ, పోలీసులు అరెస్ట్ ప్రక్రియలో సరైన నిబంధనలు (సెక్షన్ 41A నోటీసు వంటివి) పాటించలేదంటూ స్థానిక కోర్టు రిమాండ్ను తిరస్కరించి, ఆయనను వెంటనే విడుదల చేసింది. రాజాసింగ్ విడుదల తర్వాత నగరంలో తీవ్ర నిరసనలు, ఉద్రిక్తతలు వ్యక్తమయ్యాయి. దీంతో శాంతిభద్రతల పరిరక్షణ కోసం అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఆగస్టు 25న ఆయనపై పీడీ యాక్ట్ (ప్రివెంటివ్ డిటెన్షన్) నమోదు చేశారు. ఫలితంగా రాజాసింగ్ దాదాపు 77 రోజుల పాటు జైలులో గడపాల్సి వచ్చింది.
Also Read: పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్.. రూ. 2.6 కోట్ల విలువైన గాంజా స్వాధీనం
కోర్టు తీర్పు.. నిర్దోషిగా విడుదల
ఈ వ్యవహారానికి సంబంధించిన విచారణ సుదీర్ఘంగా ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో సాగింది. ఇరుపక్షాల లాయర్లు తమ వాదనలను బలంగా వినిపించారు. చివరకు పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు.. రాజాసింగ్పై మోపిన ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. పోలీసులు నిరూపించడంలో విఫలమవ్వడంతో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ మంగళవారం తుది తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో రాజాసింగ్ అనుచరులు, బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.