Hyderabad Traffic: స్వేచ్చ బ్యూరో: మీ రక్షణ కోసమే నిబంధనలు అని అధికారులు నెత్తీనోరు కొట్టుకుని చెబుతున్నా చాలామంది వాహనదారులు వాటిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుండటంతోపాటు దారిన వెళుతున్న వారి జీవితాలతో చెలగాటాలాడుతున్నారు. గత ఒక్క సంవత్సరంలోనే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2,679 రోడ్డు ప్రమాదాలు జరుగగా 294మంది మృత్యువాత పడ్డారు. మరో 2,950మంది గాయపడ్డారు. యాక్సిడెంట్లు ఎక్కువగా రోడ్డు సేఫ్టీ నిబంధనలు పాటించక పోవటం వల్లనే జరిగాయని అధికారులు చెబుతున్నారు.
ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం 43.76లక్షల వాహనాలు నిత్యం రహదారులపై పరుగులు తీస్తున్నాయి. ఏయేటికాయేడు శరవేగంగా పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా రహదారులు అభివృద్ధి మాత్రం జరగటం లేదు. ఫలితంగా పీక్ హవర్స్ లో ఓ చోటు నుంచి బయల్దేరి గమ్యస్థానానికి చేరుకోవాలంటే నరకం అనుభవించాల్సి వస్తోంది.
ఇటువంటి పరిస్థితుల్లో రోడ్డు సేఫ్టీ నిబంధనలను పాటించాల్సి ఉండగా అధికశాతం మంది వాహనదారులు అవేమీ పట్టవన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. దీనికి నిదర్శనంగా 2025లో వేర్వేరు ఉల్లంఘనలకు సంబంధించి నమోదైన కేసులను ఉదహరించ వచ్చు. మీ సురక్షిత ప్రయాణానికి తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి అంటూ ప్రతీ ప్రధాన చౌరస్తాల్లో మైకులు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నా ఇప్పటికీ దానిని చాలామంది ద్విచక్ర వాహనదారులు పాటించటం లేదు. 2025లో ఒక్క వితౌట్ హెల్మెట్ కేసులే 41.28లక్షలు నమోదయ్యాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. హెల్మెట్ పెట్టుకోకుండా రద్ధీగా ఉండే రోడ్లపై ముందుకు దూసుకెళ్లటమే లక్ష్యం అన్నట్టుగా జిగ్ జాగ్ డ్రైవింగ్ చేస్తూ చాలామంది తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దాంతోపాటు దారిన వెళుతున్న వారి జీవితాలను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారు.
Also read: గూగుల్ సంచలన నిర్ణయం.. Pixel Watch 5లో ఆ మోడల్స్ తీసేస్తున్నారా? వివరాలు లీక్!
మరికొందరు వాహనదారులు రాంగ్ రూట్లలో రయ్యిన దూసుకెళుతున్నారు. దీని వల్ల యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిసినా జరిగినపుడు చూద్దాంలే అన్నట్టుగా వాహనాలు నడుపుతున్నారు. గత ఏడాది రాంగ్ రూట్ డ్రైవింగ్ కు సంబంధించి 6.07లక్షల కేసులు నమోదయ్యాయి.
ప్రమాదాలను నివారించటానికి ఆయా రహదారులపై అధికారులు స్పీడ్ లిమిట్లను అమలు చేస్తున్నారు. అయితే, దీని గురించి అయిదు శాతం మంది వాహనదారులు కూడా పట్టించుకోవటం లేదు. ఓవర్ స్పీడింగ్, డేంజరస్ డ్రైవింగ్ కు సంబంధించి గత ఏడాదిలో 2.34లక్షల కేసులు నమోదయ్యాయి. డేంజర్ అని తెలిసినా ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి లక్షా 75వేల కేసులు రిజిష్టరయ్యాయి.
సెల్ ఫోన్లలో మాట్లాడుతూ వాహనాలను నడపవద్దని ఒకటికి పదిసార్లు చెబుతున్నా చాలామంది వాహనదారులు పట్టించుకోవటం లేదు. అదేదో కొంపలు మునిగిపోతున్నట్టు చెవి దగ్గర మొబైల్ పెట్టుకుని మెడను ఓ పక్కకు వాల్చేసి వాహనాలను నడుపుతున్నారు. స్లోగా వెళుతున్నారా? అంటే అదీ లేదు. రయ్యిన దూసుకు పోతున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలకు కారకులవుతున్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ కు సంబంధించి గత సంవత్సరం 1.26లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
Also read: పొలిటికల్ ఎంట్రీపై రాఘవ లారెన్స్ ఊహించని ట్విస్ట్.. 16 నిమిషాల సుదీర్ఘ వీడియోతో!
మద్యం మత్తులో డ్రైవింగ్ చేయవద్దన్న నిబంధనకు కూడా చాలా మంది నీళ్లొదులుతున్నారు. ఎప్పటికప్పుడు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు జరుపుతూ పట్టుకుంటున్నా…కేసులు నమోదు చేస్తున్నా దొరికినపుడు చూసుకుందాం అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. జైలు శిక్షలు పడుతున్నా పద్దతిని మార్చుకోవటం లేదు. ఒక్క 2025లోనే డ్రంకెన్ డ్రైవింగ్ కు సంబంధించి 49,732 కేసులు నమోదయ్యాయి. ఆటోల్లో పరిమితికి మంచి ప్రయాణీకులను కూర్చోబెట్టుకున్న దానికి సంబందించి 11,329 కేసులు రిజిష్టరయ్యాయి.
మైనర్లకు వాహనాలు ఇవ్వకండి అంటూ పోలీసు అధికారులు పదే పదే చెబుతున్నా చాలామంది తల్లిదండ్రులు పట్టించుకోవటం లేదు. పదిహేనేళ్ల వయసులోనే పిల్లల చేతికి వాహనాలు ఇస్తున్నారు. ఇలా కార్లు, బైకులు తీసుకుని రోడ్లపైకి వస్తున్న మైనర్లు ప్రమాదాలకు కారణమవుతున్నారు. 2025లో మైనర్ డ్రైవింగ్ కు సంబంధించి 7,808 కేసులు రిజిష్టరయ్యాయి. మైనర్లు దొరికినపుడు వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నా వారిలో ఏమాత్రం మార్పు కనిపించటం లేదు.
Also read: IAS Transfers: 28 నెలలు.. 23 సార్లు ఇవి ప్రభుత్వ బదిలీలా.. లేక వారాంతపు సంతలా..?