BRS: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దండయాత్ర మొదలుపెట్టి వెయ్యి రోజులు అయ్యిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అదే డ్యామ్ల విషయంలో బీజేపీ, గోదావరి-కృష్ణా నీటి విషయంలో టీడీపీ గురించి తన స్పీచ్లో ప్రస్తావించారు కేటీఆర్. ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం కాంగ్రెస్ మేనిఫెస్టో అని విమర్శించారు. ఇంకా ఏమన్నారంటే..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి వెయ్యి రోజులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, 1000 రోజుల్లో ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జీషీటు విడుదల చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన కేటీఆర్, కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన కాదని, పీడన అని వర్ణించారు. రైతులను రాచిరంపాన పెట్టిన రాక్షస పాలనగా పేర్కొన్నారు.
13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చారని దుయ్యబట్టారు. వెయ్యి రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగున్నర లక్షల కోట్లు అప్పు చేసినట్టు విమర్శించారు. ఒక్క చెరువు, చెక్ డ్యామ్ అంటూ ఏమీ లేవన్నారు. కేసీఆర్ చేసిన పనులకు రిబ్బన్ కటింగ్ తప్పా, కొత్తగా చేసిందేమీ లేదన్నారు. అదే సమయంలో జెన్ జీకి అర్థమయ్యే భాషలో చెప్పాలని, లేకుంటే తనను ట్రోల్ చేస్తారని చెప్పుకొచ్చారు.
అసమర్థత ప్రొమ్యాక్స్, అవినీతి అల్ట్రామ్యాక్స్, అరాచకం ఐమ్యాక్స్ అంటూ వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులను దగా చేశారని, పేదల భూములను నిషేధిత జాబితాలో పెట్టి 30 శాతం కమిషన్లు తీసుకొంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మాటికీ జలద్రోహం చేసిందని, కుక్కలు చింపిన విస్తరిలా తయారు చేసిందన్నారు.
రూ. 50 వేల కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పి, కేవలం రూ. 20 వేల కోట్లు చేశారని దుయ్యబట్టారు. రుణమాఫీ చేస్తామని దేవుళ్ల మీద ఒట్టు పెట్టారని, 70 శాతం రైతులకు కుచ్చుటోపి పెట్టారని ఆరోపించారు. దేశానికి అన్నపూర్ణగా తెలంగాణను కేసీఆర్ మారిస్తే, సర్వనాశనం చేసిందన్నారు. కాంగ్రెస్ పాలనలో ఢిల్లీకి మూటలు, పదవుల కోసం కీచులాటలు తప్ప ఏం లేదన్నారు.
ALSO READ: తెలంగాణలో 1000 రోజుల పాలన.. సీఎం రేవంత్రెడ్డి స్పెషల్ పోస్ట్, ప్రయాణంలో తోడుగా నిలిచిన
తెలంగాణ బీజేపీపై పలు ప్రశ్నలు సంధించారు. మేడిగడ్డ బ్యారేజ్లో రెండు పిల్లర్లు కుంగితే నానాయాగీ చేసిన బీజేపీ ఎక్కడుందని ప్రశ్నించారు. పెద్దవాగు కోట్టుకుపోయినా, సుంకిశాల రిటైనింగ్ వాల్ కుప్పకూలినా ఉలుకు పలుకు లేదన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలినా నేషనల్ డ్యామేజ్ సేఫ్టీ ఆథారిటీకి చీమ కుట్టినట్టు లేదన్నారు. చెక్ డ్యామ్లను పేల్చినా డ్యామ్ సేఫ్టీ సైలెంట్ అయ్యిందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు చెంచాగిరి చేయడం, గురుదక్షిణ కింద గోదావరి-కృష్ణా నీళ్లను సంతర్పణ చేయడం తెలుసన్నారు.
కేసీఆర్ పదేళ్లలో తెలంగాణను దేశానికి తలమానికంగా తీర్చిదిద్దారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ హయాంలో గొప్పగా ఉన్న రంగాలన్నీ ఇప్పుడు కుప్పకూలాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రం పురోగమనం నుంచి తిరోగమనంలోకి మళ్లిందని, రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పుకొచ్చారు.