Ramchander Rao: కాంగ్రెస్ పాలనలో ఎమర్జెన్సీ కన్నా భయంకరమైన రోజులు తెలంగాణలో కనిపిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘనంగా వెయ్యి రోజులు పూర్తయిందని గొప్పలు చెబుతోంది కానీ వెయ్యి రోజుల ప్రజా పాలన.. బాధాకరమైన పరిస్థితుల్లో ఉందన్నారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన తెలంగాణకు శాపంగా మారిందని విరుచుకుపడ్డారు.
తెలంగాణలో యుద్ధం మొదలైందని, ప్రభుత్వంపై పోరాటం చేస్తామని రాంచందర్ రావు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు, వాగ్ధానాలు అమలయ్యాయా అనే అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వంద రోజుల్లో ఉద్యోగాలు ఇస్తామన్నారని, ఆ ఉద్యోగాలు ఎక్కడికిపోయాయని నిలదీశారు. ఇప్పటి వరకు 16 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారన్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల డీఏలు, పీఆర్సీ ఎక్కడికి పోయాయని రాంచందర్ రావు ప్రశ్నించారు. వెయ్యి రోజుల్లో రేవంత్ రెడ్డి వెయ్యి అబద్ధాలు ఆడారని, పేద ప్రజలు కడుపు కాల్చుకుని ప్రభుత్వం వైపు చూస్తున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ గాంధీకి మాత్రం మూటలు పంపిస్తోందని, పేదలను మాత్రం పట్టించుకోవడంలేదన్నారు. ప్రజా పాలన అంటే ఇదేనా? అని రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
Also Read: నేపాల్ వరదల్లో నమ్మశక్యం కాని ఘటనలు.. ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన 6 అద్భుతాలు..!
అంతకుముందు నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడి నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు నల్లగొండ వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. తార్నాకలోని ఆయన నివాసం వద్ద పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆపై ఆయన్ను గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. కాగా రాంచందర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు బాధితులను పరామర్శించడానికి కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదని విమర్శించారు.
Also Read: 347 కోట్ల మంది మహిళలు.. ఆర్టీసీలో ఫ్రీ ప్రయాణం! రూ. 12,167 కోట్ల మేర ఆ కుటుంబాలకు ఆదా..!