Sathupalli Land: సత్తుపల్లి మండలంలో భూవివాదం మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తోంది.హైకోర్టులో భూవివాదం పెండింగ్లో ఉండగానే… కోర్టు ఉత్తర్వులు, పాత రెవెన్యూ రికార్డులను పక్కనపెట్టి… ఒక పక్షానికి అనుకూలంగా తహసీల్దార్ నివేదిక ఇచ్చారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.కొమ్మేపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 132, 150 భూములకు సంబంధించి గత నాలుగేళ్లుగా వివాదం కొనసాగుతోందని లింగపాలెం రైతులు చెబుతున్నారు. ఇదే భూమికి సంబంధించి హైకోర్టులో డబ్ల్యూ.పి. నం.24731/2023 కేసు పెండింగ్లో ఉందని తమ సాగుకు కిష్టారం గ్రామానికి చెందిన ఓ మహిళ పదేపదే ఆటంకం కలిగిస్తోందని కోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు కూడా పొందామని రైతులు చెబుతున్నారు.
అయితే ఆ కోర్టు ఉత్తర్వులను సైతం బేఖాతరు చేస్తూ తమ సాగుకు ఇబ్బందులు కలిగించారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అంతేకాదు ఈ భూవివాదంపై ఇప్పటికే రెండుసార్లు కంటెంప్ట్ కేసులు జరిగినట్లు రైతులు చెబుతున్నారు. కోర్టు వ్యవహారాలు, మధ్యంతర ఉత్తర్వులు, కంటెంప్ట్ కేసుల వివరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ తాజా రెవెన్యూ విచారణలో వాటిని పూర్తిస్థాయిలో పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపిస్తున్నారు.ఇక కిష్టారం గ్రామానికి చెందిన ఓ మహిళ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్ నివేదిక కోరారు. దీంతో అధికారులు హడావుడిగా విచారణ చేపట్టి నివేదిక ఇచ్చారని రైతులు ఆరోపిస్తున్నారు.
అయితే 2022లో జరిగిన సర్వే, 2024లో జరిగిన జిల్లా స్థాయి విచారణ, పాత రెవెన్యూ రికార్డులు, కోర్టు పత్రాలను పూర్తిస్థాయిలో పరిశీలించలేదని రైతులు అంటున్నారు.ఈ వ్యవహారంలో మరో కీలక అంశం సర్వే నంబర్ 150లోని 93 ఎకరాల భూమి.93 ఎకరాల వివరాలు అధికారులకు ముందే తెలిసి ఉంటే నిషేధిత జాబితా రికార్డుల్లో ఎందుకు నమోదు చేయలేదని..? అసైన్డ్ భూమిని పట్టా భూములుగా చూపించే ప్రయత్నం జరుగుతోందా? అనే అనుమానాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు సంబంధిత మహిళకు ఉన్నట్లు చెబుతున్న 1997 నాటి తుది పట్టాలో హద్దుదారుల వివరాలు లేకపోయినా… తాజాగా కొత్త సరిహద్దుదారుల వాంగ్మూలాలు ఎలా తీసుకున్నారు..? అని ప్రశ్నిస్తున్నారు.
Also read: అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!
వాంగ్మూలాలు ఇచ్చిన వ్యక్తులకు భూములు లేవని వారు అక్కడ సాగులో ఉన్నట్లు రైతులు ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు. గతంలో జరిగిన భౌతిక విచారణలో సదరు మహిళ సాగులో లేదని నిర్ధారించే ఆధారాలు, కోర్టు రికార్డులను తహసీల్దార్కు చూపించినప్పటికీ పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు తాజా నివేదికలో సర్వే నంబర్ 150లో 93 ఎకరాలు ఉన్నట్లు పేర్కొంటే సర్వే నంబర్ 132 మధ్యలో సర్వే నంబర్ 150కు చెందిన భూమి ఎలా ఉంటుంది..? మరి మిగిలిన 88 ఎకరాల భూమి ఎక్కడ ఉంది..? అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
తాజా రెవెన్యూ నివేదికలో వాస్తవాలను పక్కనపెట్టి ఒక పక్షానికి అనుకూలంగా వివరాలు నమోదు చేశారన్న ఆరోపణలపై… జిల్లా కలెక్టర్ స్వతంత్ర, సమగ్ర విచారణ జరిపించాలని లింగపాలెం రైతులు డిమాండ్ చేస్తున్నారు.విచారణలో పక్షపాతం, రికార్డుల విస్మరణ లేదా అధికార దుర్వినియోగం నిర్ధారణ అయితే సంబంధిత తహసీల్దార్, గిర్దావర్లపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.కోర్టు ఉత్తర్వులు, పాత రెవెన్యూ రికార్డులు, తాజా నివేదిక… వీటిలో అసలు వాస్తవం ఏది ఇప్పుడు అందరి దృష్టి జిల్లా స్థాయి విచారణపైనే ఉంది.
Also read: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?