Harish Rao: కాంగ్రెస్ తన 1000 రోజులు పాలనలో ప్రజలకు చేసిన మంచి కంటే సృష్టించిన విధ్వంసమే ఎక్కువ ఉందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. ఇందుకు రోడ్డున పడుతున్న విద్యార్థుల భవిష్యత్తే ప్రత్యక్ష సాక్ష్యమని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థ అంటూ బడాయి కొట్టే కాంగ్రెస్ ప్రభుత్వం.. నెలలు గడుస్తున్నా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం సిగ్గుచేటన్నారు.
హైదరాబాద్ లో ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు హరీశ్ రావును కలిసి వినతి పత్రం అందజేశారు. తప ఇబ్బందులను వివరించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఫీజు బకాయిలు రాక ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధ్యాపకులు, నాన్-టీచింగ్ సిబ్బందికి నెలల తరబడి జీతాలు అందక నరకం చూస్తున్నారన్నారు. భవనం అద్దెలు, విద్యుత్ బిల్లులు, యూనివర్సిటీ ఫీజులు, ఇతర నిర్వహణ ఖర్చులు భరించలేక కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్నారు.
ఒకప్పుడు రాష్ట్రంలో 960గా ఉన్న ప్రైవేట్ డిగ్రీ కళాశాలల సంఖ్య ఇప్పుడు దాదాపు 650కి పడిపోయిందని హరీశ్ రావు గుర్తుచేశారు. ఇప్పటికే సుమారు 310 కళాశాలలు మూతపడ్డాయన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరిన్ని కళాశాలలు మూతపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక కళాశాల మూతపడటం అంటే ఆ ప్రాంతంలోని వందలాది, వేలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్య దూరం కావడమేనన్నారు.
Also Read: 1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్పై రాంచందరావు ఫైర్
ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో కొన్ని కళాశాలల్లో అధ్యాపకులు, సిబ్బందికి 5 నుంచి 10 నెలల వరకు జీతాలు పెండింగ్లో ఉన్నాయని హరీశ్ రావు తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే నాటికి రూ.2,500 కోట్ల ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలు ఉంటే.. వాటిని వెంటనే చెల్లించామన్నారు. కేసీఆర్.. పెద్ద నోట్ల రద్దు జరిగినా, కరోనా విపత్తు వచ్చినా ఫీజు రియింబర్స్ మెంట్ ఆపలేదన్నారు. తొమ్మిదిన్నరేండ్లలో గత కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బకాయిలతో సహా రూ.19,500 కోట్లు ఫీజు రియింబర్స్ మెంట్ రూపంలో కేసీఆర్ ప్రభుత్వం చెల్లించిందన్నారు.
Also Read: మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం