తెలంగాణలోని జిల్లాలు, మండలాల పునర్విభజనపై సీఎం రేవంత్ ప్రకటన మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచింది. గత బీఆర్ఎస్ హయాంలో జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా జరగలేదని ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. తాజాగా అదే విషయాన్ని సీఎం రేవంత్ సైతం ధ్రువీకరించారు. ఎక్కడైతే జిల్లాల పునర్విభజన సరిగా జరగలేదో అక్కడ మరోసారి విభజన ప్రాసెస్ చేపడతామని సీఎం ప్రకటించారు. అందుకోసం ప్రత్యేకంగా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేయించి నివేదిక తెప్పించుకుంటామన్నారు. అంతేకాకుండా ఈ అంశంపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నిన్న ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఘాటుగా స్పందించారు. అసలు జిల్లాల పునర్విభజన చేయడం ఎందుకుని ప్రశ్నించారు. పరిపాలన అభివృద్ధి కోసమే ఉద్యమనేత, అప్పటి సీఎం కేసీఆర్ జిల్లాలను విభజించారని.. అప్పుడే ప్రాంతాల అభివృద్ధి సాధ్యం అవుతుందని నమ్మారని వివరించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయాలని చూస్తున్నదని అందుకే మరోసారి కొత్త డ్రామాకు తెరలేపిందని ఆయన ఆరోపించారు. జిల్లా అభివృద్ధికి నిధులు ఇవ్వడం తెలియని ముఖ్యమంత్రి.. మరోసారి జిల్లాలు, మండల పునర్విభజన పేరిట నిధుల గోల్ మాల్కు తెరలేపారని ఆరోపణలు చేశారు.
జిల్లాలు, మండలాలను తగ్గించినా, రద్దు చేసినా రాష్ట్రంలో అగ్గిరాజేస్తామని తెలంగాణ సర్కారును కేటీఆర్ హెచ్చరించారు. ఎన్నికల్లో లబ్దిపొందడానికే సీఎం రేవంత్ ఇలాంటి కుట్రలకు తెరలేపుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీ నేత కేటీఆర్ వ్యాఖ్యలు ఇలాఉండగా.. అధికార పార్టీ నుంచి మరో విధంగా వాదన వినిపిస్తున్నది. అసలు ఒక ఎమ్మెల్యే నియోజకవర్గం రెండు, మూడు జిల్లాల్లో ఉంటుందా? అని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఒక మండలం ఇంకో మండలంలోకి ఎలా వెళ్తుందని అడుగుతున్నారు.
Skill Development Case: సీఎం చంద్రబాబు భారీ ఊరట.. స్కిల్ స్కాం కేసును క్లోజ్ చేసిన ఏసీబీ కోర్టు
జిల్లాల పునర్విభజన చేస్తే రాష్ట్రంలో అగ్గిరాజేస్తా అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ నేతలు సైతం ఘాటుగానే బదులిస్తున్నారు. అసలు కేటీఆర్కు రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది తెలుస్తున్నదా? అని ప్రశ్నించారు. వారి హయాంలో కేవలం దోచుకోవడం దాచుకోవడం మీదే దృష్టి ఉండేదని.. పరిపాలనలో జిల్లా అధికారుల కొరత వేధిస్తున్నది.. ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలడం లేదని ప్రభుత్వం వాదిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ఉన్న 10 జిల్లాలను కేసీఆర్ ఇష్టానుసారంగా 33 జిల్లాలుగా విభజించారని..మరి అన్ని జిల్లాలకు ఐఏఎస్, ఐపీఎస్లను కేంద్రం కేటాయించనప్పుడు పాలన ఎలా సాగుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఒక్కో అధికారి రెండు, మూడు జిల్లాల బాధ్యతలు చూస్తున్నారని గుర్తుచేస్తున్నారు. వారి మీద వర్క్ ప్రెజర్ పెరుగుతోందని.. తద్వారా పనులన్నీ పెండింగ్ పడుతున్నాయని పేర్కొంటున్నారు. దీనికి తోడు చిన్న జిల్లాలో ఎక్కువ ముక్కలు.. పెద్ద జిల్లాలో తక్కువ ముక్కలు చేశారని.. ఫలితంగా ఎమ్మెల్యే నియోజకవర్గాలు రెండు, మూడు జిల్లాల్లో ఉన్నాయని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా సీఎం రేవంత్ ప్రకటన ప్రకారం ఈ ఏడాది చివరలో లోక్సభ నియోజకవర్గాల వారీగా 17 నుంచి 20 జిల్లాలకు ప్రస్తుతం ఉన్న వాటిని కుదిస్తారని ప్రచారం జరుగుతోంది.