MP Arvind Comments: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు. అవినీతి, పాలన, ఎన్నికలు, పంచాయితీ నిధుల అంశాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
రేవంత్ రెడ్డికి నిజంగా పౌరుషం ఉంటే, తాను నిజంగా పాలమూరు బిడ్డవైతే.. అవినీతికి పాల్పడ్డ కల్వకుంట్ల కుటుంబ సభ్యులను జైలుకు పంపాలి అని సవాల్ విసిరారు. అవినీతి ఆరోపణలున్న వారిపై చర్యలు తీసుకోకుండా ప్యాకేజీలు మాట్లాడుకుంటూ.. అరెస్ట్ చేయకుండా తమాషా చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక మాటలు మారిపోయాయని, చర్యల్లో మాత్రం చిత్తశుద్ధి కనిపించడం లేదని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రస్థానంపై కూడా ఎంపీ అరవింద్ విమర్శలు చేశారు. 2023 వరకు కాంగ్రెస్ పార్టీకి వరుస ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కలేదని గుర్తుచేశారు. అప్పట్లో బీజేపీకి అనుకూల పరిస్థితులు లేకపోవడం వల్లే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఇది కాంగ్రెస్ పార్టీ బలమేమీ కాదని, పరిస్థితుల అనుకూలత వల్ల జరిగిన పరిణామమని అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూనే, కొన్ని విషయాల్లో అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసీఆర్ను లిపాక్ పతంగ్ తో పోల్చిన అరవింద్, ఆయన మాటల్లో వైరాగ్యం తప్ప ఇంకేమీ లేదని వ్యాఖ్యానించారు. ఉద్యమ నేతగా కేసీఆర్పై తనకూ ఒకప్పుడు అభిమానముందని చెప్పారు. అయితే ఆ అభిమానాన్ని ఆయన పాలన తుడిచిపెట్టేసిందని విమర్శించారు.
ఇరిగేషన్ విషయంలో కేసీఆర్కు మంచి అవగాహన ఉందని ఒప్పుకున్న అరవింద్, ఆ అవగాహనను ప్రజల మేలు కోసం కాకుండా సుమారు 50 వేల కోట్ల రూపాయలు దోచుకునేందుకు ఉపయోగించారని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ సమాజానికి కేసీఆర్ నమ్మక ద్రోహిగా మారారని వ్యాఖ్యానించారు. ప్రజల ఆశలను వంచించారని, ఉద్యమ సమయంలో చెప్పిన మాటలకు పాలనలో చేసిన పనులకు పొంతన లేదని విమర్శించారు.
కేసీఆర్ వయసును కేటీఆర్ పదే పదే ప్రస్తావించడం వెనుక అసలు మర్మం ఏంటని ప్రశ్నించారు. ఇది రాజకీయ వ్యూహమా? లేక అంతర్గత భయాలా? అని అనుమానం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ లోపలే అనిశ్చితి వాతావరణం నెలకొందని ఆయన వ్యాఖ్యానించారు.
ఎన్నికల అంశంలో బీజేపీ సత్తాను అరవింద్ ప్రస్తావించారు. పంచాయితీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ పార్టీ తన శక్తిని స్పష్టంగా చూపిందని అన్నారు. గ్రామస్థాయి నుంచే బీజేపీకి మద్దతు పెరుగుతోందని చెప్పారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయ డంకా మోగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
పంచాయితీ నిధుల అంశంలో సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి విమర్శలు చేశారు. గ్రామ పంచాయితీ నిధుల కోసం సీఎం ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా పంచాయితీలకు నిధులు విడుదల చేస్తుందని స్పష్టం చేశారు. ఢిల్లీకి వెళ్లి సంచులు మోసుకొచ్చినట్టు బిల్డప్ ఇవ్వడం అవసరం లేదని ఎద్దేవా చేశారు.
Also Read: అందరి చేతిలో స్మార్ట్ఫోన్లు ఉన్నాయంటే.. రాజీవ్ గాంధీ కారణం: మహేశ్ కుమార్ గౌడ్
15వ ఆర్థిక సంఘం నిధులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయని, వాటికి రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదని అరవింద్ స్పష్టం చేశారు. కేంద్రం నిబంధనల ప్రకారం నేరుగా పంచాయితీలకు నిధులు ఇస్తుందని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని, తప్పుడు ప్రచారాలకు లోనుకావద్దని సూచించారు.