Techie Suicide: హైదరాబాద్లో ఇటీవల జరిగిన ఒక విషాద సంఘటన ఐటీ రంగంలో పెరిగిపోతున్న మానసిక ఒత్తిళ్లను, దాని వెనుక ఉన్న భయానక పరిణామాలను మరోసారి కళ్లముందుంచింది. చిన్న వయసులోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి, లక్షల్లో జీతం సంపాదిస్తూ ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఒక యువతి జీవితం ఒక్కసారిగా విషాదాంతమైంది. విధుల్లోని పని ఒత్తిడిని తట్టుకోలేక, మానసిక సమతుల్యత కోల్పోయి ఆమె తీసుకున్న తీవ్ర నిర్ణయం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో సైతం హాట్ టాపిక్గా మారింది.
విజయనగరం టు బెంగళూరు.. సాఫ్ట్వేర్ ప్రయాణం
ఏపీలోని విజయనగరం జిల్లా, దేవరపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి. చదువు పూర్తి కాగానే బెంగళూరులోని ఒక ప్రముఖ ఐటీ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం సంపాదించింది. నెలకు లక్షల్లో జీతం వస్తుండటంతో ఆ కుటుంబం ఎంతో సంతోషించింది. అయితే, రోజురోజుకూ పెరుగుతున్న పని ఒత్తిడి, టార్గెట్లు ఆమెను మానసికంగా కుంగదీశాయి. ఆ ఒత్తిడిని భరించలేక ఆరు నెలల క్రితమే ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసి విశాఖపట్నంలోని తన ఇంటికి తిరిగి వచ్చేసింది.
హైదరాబాద్కు మార్పు.. కొనసాగిన మానసిక సంఘర్షణ
కూతురు మానసిక స్థితిని గమనించిన తల్లి , ఆమెకు అండగా నిలబడాలని నిశ్చయించుకుంది. మానసిక ప్రశాంతత కోసం రెండు నెలల క్రితం తల్లి, కూతురు ఇద్దరూ కలిసి హైదరాబాద్కు వచ్చారు. పీర్జాదిగూడలోని శంకర్ నగర్ కాలనీలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో మరో మంచి ప్రాంతంలో ఇల్లు మారేందుకు శుక్రవారం సాయంత్రం వరకు మియాపూర్ పరిసరాల్లో ఇద్దరూ కలిసి ఇళ్ల కోసం వెతికారు. రాత్రి అలసిపోయి ఇంటికి వచ్చి పడుకున్నాక, యువతి మనసులో ఏదో తెలియని భయం, ఆందోళన ఆమెను నిద్రపోనివ్వలేదు.
అర్ధరాత్రి వేళ సీసీటీవీల్లో షాకింగ్ దృశ్యాలు
అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2:30 గంటల సమయంలో యువతి నిద్రలేచింది. పక్కనే పడుకున్న తల్లి గదికి బయట నుంచి తాళం వేసింది. ఆ తర్వాత తీవ్రమైన మానసిక ఆందోళనతో ఒంటిపై బట్టలు లేకుండా, చేతిలో కేవలం ఒక చీరను పట్టుకుని వీధిలోకి పరుగెత్తుకుంటూ వెళ్ళింది. మార్గమధ్యలో స్థానికంగా ఉన్న బీరప్ప గుడి వద్ద ఆగి, దేవుడికి దండం పెట్టుకుంది. ఆ వెంటనే మళ్లీ పరుగు లంకించుకుని నేరుగా పీర్జాదిగూడ చెరువు వద్దకు వెళ్లి, క్షణికావేశంలో నీటిలో దూకేసింది. ఈ హృదయవిదారక దృశ్యాలన్నీ స్థానిక సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
పోలీసుల దర్యాప్తు.. భయానక ఫోబియా నిజాలు
ఉదయం నిద్రలేచిన తల్లి బయట నుంచి తాళం వేసి ఉండటంతో కంగారుపడి గట్టిగా కేకలు వేసింది. పొరుగువారు వచ్చి తలుపులు తీయగా, కూతురు కనిపించకపోవడంతో అంతా వెతకడం ప్రారంభించారు. చివరకు పీర్జాదిగూడ చెరువులో కూతురు మృతదేహాన్ని గుర్తించి కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు, హైడ్రా, డీఆర్ఎఫ్ బృందాల సాయంతో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. తన కుమార్తె గత కొన్ని రోజులుగా తీవ్రమైన పీడకలలతో బాధపడుతోందని, మానసిక ఒత్తిడి వల్లే ఈ అఘాయిత్యానికి పాల్పడిందని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో ఆమె తీవ్రమైన ‘ఫియర్ ఫోబియా’తో బాధపడుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
Also Read: వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!