Karla Rajesh Custodial Death: సూర్యాపేట జిల్లా కోదాడలో పోలీస్ కస్టడీలో మృతి చెందిన దళిత యువకుడు కర్ల రాజేష్ మృతిపై జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. రాజేష్ మృతిని కమిషన్ సుమోటోగా స్వీకరించిందని ఆయన తెలిపారు. పోలీస్ కస్టడీలో రాజేష్ను చిత్రహింసలకు గురిచేశారని.. ఆ నొప్పులు బయటకు తెలియకుండా పెయిన్ కిల్లర్స్ ఇచ్చి కోర్టులో హాజరుపరిచారని రామచందర్ ఆరోపించారు. రిమాండ్కు వెళ్లిన ఐదు రోజులకే ఊపిరి ఆడకపోవడంతో రాజేష్ మృతి చెందడం పోలీసుల వైఫల్యమేనని స్పష్టం చేశారు.
కమిషన్ జోక్యం చేసుకున్న తర్వాతే బాధ్యులైన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని రామచందర్ వివరించారు. ఈ ఘటనలో సీఐను సస్పెండ్ చేసినప్పటికీ.. ఎస్సైపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా ఎస్సైని కూడా సస్పెండ్ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. కమిషన్ బృందం కోదాడలో క్షేత్రస్థాయి పర్యటన చేసి పబ్లిక్ హియరింగ్ నిర్వహించిందని.. బాధితుడికి న్యాయం జరిగే వరకు వెన్నంటే ఉంటామని భరోసా ఇచ్చారు. పది రోజుల్లోగా రాజేష్ మృతదేహానికి రీ-పోస్ట్మార్టం నిర్వహించేందుకు అధికారులు అంగీకరించారని చెప్పారు.
బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందాల్సిన పూర్తి పరిహారం అందలేదని కమిషన్ సభ్యులు ఎత్తిచూపారు. కమిషన్ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ పది రోజుల్లో బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మూడెకరాల భూమి కేటాయింపునకు సానుకూలత వ్యక్తం చేయడంతో పాటు.. బాధిత కుటుంబానికి నెలకు ఐదు వేల రూపాయల పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకున్నట్లు రామచందర్ తెలిపారు. ప్రభుత్వం తరపున డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదా పక్కా గృహాన్ని నిర్మించి ఇవ్వాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. పోలీసుల కస్టడీకి సంబంధించిన మూడు రోజుల సీసీ టీవీ ఫుటేజీని అందజేయాలని కమిషన్ గట్టిగా కోరింది.
ఎస్సీలకు అన్యాయం జరిగితే తక్షణమే స్పందించాలని ప్రధానమంత్రి ఆదేశించినట్లు వడ్డేపల్లి రామచందర్ గుర్తుచేశారు. కమిషన్ ఇచ్చే ఆదేశాలను బేఖాతరు చేస్తే అధికారులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం సెక్షన్ 4 కింద ఆదేశాలు పాటించని అధికారులకు ఆరు నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో 83 కేసులు కమిషన్ వద్ద సుమోటోగా ఉన్నాయని.. అధికారులు వాటిని వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. దళితుల రక్షణకు కమిషన్ ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.