Father Abuse: నేటి సమాజంలో మనిషి మృగంగా మారుతున్నాడంటే అది తక్కువే అవుతుందేమో. రోజురోజుకీ పెరిగిపోతున్న అత్యాచారాలు, అమానుష ఘటనలు నాగరిక సమాజానికే మచ్చగా మారుతున్నాయి. చిన్నారులు అని కూడా చూడకుండా రాబందుల్లా మీద పడుతున్న కామాంధుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది.
సాధారణంగా బయట వ్యక్తుల నుంచి బిడ్డలకు ప్రమాదం పొంచి ఉంటుందని భయపడతాం. కానీ.. కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. కామాంధుడిలా మారి ఆ పసి ప్రాణంపై పడితే? రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అని కూడా చూడకుండా వావివరుసలు మరిచి ప్రవర్తిస్తే.. ఆ చిన్నారి ఇంక ఎవరికి చెప్పుకుంటుంది? తన బాధను ఎవరితో పంచుకుంటుంది? అలాంటి హృదయ విదారకమైన ఘటనే ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడి YSR కాలనీకి చెందిన ఓ వ్యక్తి.. తన కన్నకూతురిపై గత మూడు నెలలుగా నిరంతరం అత్యాచారానికి పాల్పడుతున్నాడు. బయటకు చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆ బాలిక ఇన్నాళ్లూ నరకయాతన అనుభవించింది. అయితే.. తనపై జరుగుతున్న అకృత్యాలను భరించలేక.. చివరకు ధైర్యం చేసి స్కూల్ టీచర్కు తన ఆవేదనను వివరించింది. ఆ తండ్రి చేస్తున్న అమానుష పనులను విని ఉపాధ్యాయులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
విషయం తెలిసిన వెంటనే పాఠశాల యాజమాన్యం , ఉపాధ్యాయులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన సి.డబ్ల్యూ.సి సభ్యులు బాలిక నుంచి వివరాలు సేకరించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణ రక్షణ చర్యల్లో భాగంగా బాధితురాలిని సురక్షిత ప్రాంతమైన ‘ప్రజ్వల హోమ్’కు తరలించారు. అక్కడ బాలికకు మానసిక ధైర్యాన్ని అందించడంతో పాటు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడైన తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోక్సో (POCSO) చట్టం కింద , ఇతర కఠినమైన సెక్షన్లతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.‘కంచే చేను మేసినట్లు’తన కూతురి జీవితాన్ని నాశనం చేసిన ఈ కీచక తండ్రిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు వెల్లడించారు.
Also Read: నిజామాబాద్ వేదికగా సర్కార్ మార్క్ పాలన.. హామీల అమలుపై మంత్రి పొన్నం ధీమా!