గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు క్లైమాక్స్కు చేరింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టై ఏ1 నిందితుడిగా పిలువబడుతున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును లొంగిపోవాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో ఆయన జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయంలో లొంగిపోయిన విషయం తెలిసిందే. అయితే, గత కొంతకాలంగా ఆయన విచారణకు సహకరించడం లేదని, పెన్ డ్రైవ్స్, ల్యాప్ట్యాప్స్ పాస్వర్డ్స్ చెప్పడం లేదని సిట్ సుప్రీంకోర్టుకు పలుమార్లు విన్నవించింది. ఆయనకు కోర్టు కల్పించిన ఇంటీరియమ్ ప్రొటెక్షన్ రద్దు చేయాలని సిట్ కోరింది. కానీ, సర్వోన్నత న్యాయస్థానం మాత్రం ఆయన్ను లొంగిపోవాలని ఆదేశించడంతో ట్యాపింగ్ కేసు చివరి దశకు చేరుకున్నదని.. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక చేరుతుందని తెలుస్తున్నది.
ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రస్తుతం సిట్ అధికారుల కస్టడీలో ఉన్నారు. ఆయన్ను కేసు వివరాల రాబట్టేందుకు విచారించాలి తప్పా రఫ్గా హ్యాండిల్ చేయరాదని సుప్రీం కోర్టు తీర్పు అమల్లో ఉంది. ఈ క్రమంలో దర్యాప్తు బృందం అధికారులు ఆయన్ను అప్రూవర్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రభాకర్ రావు నోరు విప్పితేనే అసలు కథంతా ముందుకు సాగుతుందని అధికారులు భావిస్తున్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక నిందితులు ఎవరు? ట్యాపింగ్ చేయాలని ఎస్ఐబీకి ఎవరు ఆదేశాలిచ్చారు? ఇజ్రయెల్ నుంచి పరికరాల కొనుగోలకు ఆదేశాలు ఎవరిచ్చారు? గత ప్రభుత్వంలో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయబడ్డాయి. మావోయిస్టుల పేరు చెప్పి ఎంత మంది కాల్స్ రికార్డు చేశారు? అందులో ప్రతిపక్ష లీడర్లపేర్లు, సెబబ్రిటీలు ఎంత మంది ఉన్నారు? రికార్డు చేశాక ఆ సమాచారాన్ని ఎవరికి చేరవేశారు? వంటి సమాచారాన్ని సిట్ అధికారులు సేకరించి నివేదిక తయారు చేయనున్నారు.డిసెంబర్ 19న సుప్రీంకోర్టుకు సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని స్వయంగా డీల్ చేశారు. అప్పుడు ఆయన బృందంలో పనిచేసిన వారిని సిట్ అరెస్టు చేసి పలుమార్లు విచారించి సమాచారం సేకరించింది. వారంతా అప్రూవర్గా మారినట్టు సమాచారం. చివరగా ఎస్ఐబీ మాజీ చీఫ్ అప్రూవర్గా మారితే సిట్ దర్యాప్తు చివరి దశకు చేరినట్టు అవుతుంది. ఎందుకంటే కీలక సమాచారం ఆయనకు మాత్రమే తెలుసు. చాలావరకు డేటాను ఆయన ధ్వంసం చేశారు. హార్డ్ డిస్కుల్లోని సమాచారాన్ని బ్రేక్ చేశారు. ఆయన నోరు విప్పితే గత బీఆర్ఎస్ పెద్దల ఖేల్ ఖతమని ప్రచారం జరుగుతోంది.
అందులో గులాబీ బాస్, చిన్న బాస్, మాజీ మంత్రుల పేర్లు కూడా ఉన్నట్లు గతంలో పెద్దఎత్తున ప్రచారం జరిగింది.అదే నిజమా? టాప్ లీడర్లే ఎన్నికలకు ముందు ప్రతిపక్ష లీడర్ల ఫోన్లు ట్యాప్ చేయించరా? వీరితో పాటే సెలబ్రిటీల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు.. లాయర్లు, జడ్జిల ఫోన్స్ కూడా ట్యాప్ అయినట్టు విచారణలో సిట్ అధికారులు గుర్తించారు.దీనికి తోడు తన భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారని కేసీఆర్ కూతురే స్వయంగా మీడియాకు వివరించారు. సొంత అల్లుడి, బావ ఫోన్ను ట్యాప్ చేయిస్తారా? అంటూ తన తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ను ఆమె మీడియా ముఖంగా విమర్శించారు. కవిత కామెంట్లతో ఏకంగా గులాబీ బాస్, చోట బాస్ హస్తమున్నట్లు పొలిటికల్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ప్రభాకర్ రావు కూడా విచారణలో వారి పేర్లు చెబితే త్వరలోనే వారి అరెస్టు ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది.