Prabhakar Rao: మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుపై సాగిన కస్టోడియల్ విచారణ ముగిసింది. వారం రోజుల పాటు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిర్వహించిన విచారణ గురువారంతో పూర్తి అయింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావును సిట్ ప్రశ్నించినప్పటికీ, విచారణలో ఆయన నోరు విప్పలేదని సిట్ అధికారులు స్పష్టం చేశారు. కేసుకు సంబంధించి కీలక సమాచారం ఏదీ ప్రభాకర్ రావు ఇవ్వలేదని సిట్ వర్గాలు వెల్లడించాయి.
విచారణ సమయంలో తాను పూర్తిగా నిబంధనల ప్రకారమే పని చేశానని.. ప్రభాకర్ రావు పదే పదే చెప్పినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పూర్తిగా పై అధికారుల ఆదేశాలతోనే జరిగిందని, వ్యక్తిగతంగా తాను ఎలాంటి అక్రమ నిర్ణయాలు తీసుకోలేదని ఆయన వాదనగా వినిపించింది. ట్యాపింగ్కు సంబంధించి రివ్యూ కమిటీ అనుమతి తప్పనిసరిగా ఉంటుందని, ఆ అనుమతితోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ప్రభాకర్ రావు సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది.
అయితే రాజకీయ నేతలు, జర్నలిస్టుల ఫోన్ల ట్యాపింగ్ అంశంపై మాత్రం.. ప్రభాకర్ రావు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని సిట్ అధికారులు చెబుతున్నారు. ఎవరి ఆదేశాలతో, ఎలాంటి కారణాలతో ఫోన్లను ట్యాప్ చేశారన్న కీలక ప్రశ్నలకు ఆయన సమాధానాలు దాటవేసినట్లు సమాచారం. దీంతో అసలు సూత్రధారులు ఎవరు? ట్యాపింగ్ వెనుక ఉన్న రాజకీయ ఆదేశాలు ఏవన్న అంశాలపై సిట్కు స్పష్టత రాలేదు.
హార్డ్డిస్కుల ధ్వంసం అంశంపైనా ప్రభాకర్ రావు తన వాదనను వినిపించారు. నిబంధనల ప్రకారమే హార్డ్డిస్కులను ధ్వంసం చేశానని, ఇందులో ఎలాంటి అక్రమ ఉద్దేశం లేదని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. ఈమెయిల్, క్లౌడ్ డేటాలోనూ కేవలం వ్యక్తిగత సమాచారమే డిలీట్ చేశామని, కేసుకు సంబంధించి కీలక డేటా తొలగించలేదని ఆయన వాదన.
ట్యాపింగ్కు ఉపయోగించిన పరికరాలపై అడిగిన ప్రశ్నలకు ప్రభాకర్ రావు ఇచ్చిన సమాధానాలు.. మరింత అనుమానాలకు దారితీశాయి. ట్యాపింగ్ డివైజ్లు అమెరికాలోనే మరిచిపోయానని ఆయన చెప్పడం సిట్ అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.
వారం రోజుల విచారణలో ప్రభాకర్ రావు నుంచి కీలక సమాచారం రాబట్టడంలో సిట్ విఫలమైంది. అసలు ఈ వ్యవహారానికి సూత్రధారులెవరు? ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ జరిగింది? అనే ప్రధాన ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు లభించలేదు. ఈ నేపథ్యంలో విచారణలో సేకరించిన పూర్తి వివరాలతో సిట్ సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించేందుకు సిద్ధమవుతోంది.
ఇదిలా ఉండగా ప్రభాకర్ రావుకు ప్రస్తుతం ఉన్న మధ్యంతర రక్షణపై సిట్ కీలకంగా ఆలోచిస్తోంది. సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర రక్షణ తొలగింపుపై న్యాయపరంగా అడుగులు వేయాలని సిట్ భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ మధ్యంతర రక్షణ తొలగితే ప్రభాకర్ రావును అరెస్ట్ చేసే దిశగా సిట్ చర్యలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.
ఈ వ్యవహారంపై దర్యాప్తును మరింత వేగవంతం చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో.. ఈ కొత్త సిట్ను ఏర్పాటు చేస్తూ డీజీపీ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్తగా ఏర్పాటు చేసిన సిట్లో మొత్తం తొమ్మిది మంది అధికారులు ఉండనున్నారు. ఇందులో ఐదుగురు ఐపీఎస్ అధికారులు కీలక పాత్ర పోషించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై సమగ్రంగా విచారణ జరిపి, వాస్తవాలను న్యాయస్థానం ముందు ఉంచడమే లక్ష్యంగా ఈ సిట్ పని చేయనుంది.
Also Read: సీఎం రేవంత్రెడ్డితో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ భేటీ.. సంస్కరణలు, ఆ చట్టంపై చర్చ
శుక్రవారం సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించిన కీలక విచారణ జరగనున్న నేపథ్యంలోనే డీజీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.