Retd IAS AK Goel : తన ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్యాడ్ టాస్క్ ఫోర్స్ తనిఖీలపై మాజీ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫిర్యాదుతో శుక్రవారం హైదరాబాద్ లోని ఏకే గోయల్ ఇంట్లో ఎలక్షన్ ఫ్లైయింగ్ స్క్యాడ్ టాస్క్ ఫోర్స్ తనిఖీలు చేపట్టింది. తన ఇంట్లో అక్రమ డబ్బు, మద్యం ఉన్నాయని ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేసేందుకు వచ్చారు వారికి పూర్తిగా సహకరించానని తెలిపారు.
తన ఇంట్లో ఎలాంటి అక్రమ డబ్బు, మద్యం గుర్తించలేదన్నారు ఏకే గోయల్. తన ఇంట్లో అక్రమ డబ్బు, మద్యం ఉన్నాయని తనపై ఆరోపణలు చేసి తన పరువుకు భంగం కలిగించారంటూ ఆరోపించారు. తన ఇంట్లో అక్రమ మధ్యం, డబ్బు ఉందంటూ హడావిడి చేసిన కాంగ్రెస్ నేతలపై పరువు నష్టం దావా వేస్తానని ఏకే గోయల్ అన్నారు.
మాజీ ఎంపీలు మల్లు రవి, అజారుద్దీన్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి విజయ రెడ్డిపై కోర్టులో కేస్ వేస్తానని చెప్పారు గోయల్. తన ఇంట్లో కాంగ్రెస్ నాయకులు చేసిన విధ్వంసం వీడియోలు సహా ఆధారాలు ఉన్నాయని, వాటన్నింటినీ కోర్టుకు అందజేస్తానని తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయిస్తానని పేర్కొన్నారు. అయితే గోయల్ తన ఇంట్లో తనిఖీలకు అధికారులను అనుమతించలేదు. తిరిగి ఇప్పుడు కాంగ్రెస్ నేతలపైనే కేసులు వేస్తానని చెప్పడంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.