Digital Arrest Scam: హైదరాబాద్లోని నేరెడ్మెట్ పరిధిలో ఒక రిటైర్డ్ జడ్జిని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.1.66 కోట్లు కాజేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సాధారణ పౌరులనే కాకుండా చట్టంపై పూర్తి అవగాహన ఉన్న ఉన్నత స్థాయి వ్యక్తులను కూడా ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో నేరగాళ్లు ఎలా బోల్తా కొట్టిస్తున్నారో ఈ ఘటన అద్దం పడుతోంది.
నేరగాళ్లు బాధితుడికి వీడియో కాల్ చేసి.. తాము CBI అధికారులుగా పరిచయం చేసుకున్నారు. మీ ఆధార్ కార్డుకు లింక్ అయిన రెండు మొబైల్ నంబర్ల ద్వారా మహిళలకు అసభ్యకరమైన కాల్స్ వెళ్తున్నాయని.. అలాగే మనీలాండరింగ్ , మానవ అక్రమ రవాణా వంటి తీవ్రమైన కేసుల్లో మీకు సంబంధం ఉందని నమ్మించారు. బెంగళూరులోని ఇందిరానగర్ పోలీస్ స్టేషన్లో మీపై కేసు నమోదైందని.. సుప్రీంకోర్టు ఇప్పటికే నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందని తప్పుడు ఆధారాలు చూపి భయభ్రాంతులకు గురిచేశారు.
విచారణ పూర్తయ్యే వరకు ఇంటి నుంచి బయటకు రావొద్దన, ఎవరికీ ఫోన్లు చేయవద్దని బాధితుడిని ‘డిజిటల్ అరెస్ట్’ చేశారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులతో కానీ, స్నేహితులతో కానీ చర్చిస్తే అరెస్ట్ తప్పదని హెచ్చరించారు. గౌరవప్రదమైన వృత్తిలో ఉండి రిటైర్ అయిన వ్యక్తి కావడంతో తన ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందనే ఆందోళనతో ఆయన వారు చెప్పినట్లు విన్నారు.
విచారణలో భాగంగా మీ బ్యాంక్ ఖాతాల్లోని నగదును ప్రభుత్వానికి బదిలీ చేయాలని, తనిఖీ పూర్తయిన తర్వాత క్లీన్ చిట్ ఇచ్చి ఆ సొమ్మును తిరిగి ఇచ్చేస్తామని నిందితులు మాయమాటలు చెప్పారు. వారిని నమ్మిన రిటైర్డ్ జడ్జి విడతల వారీగా మొత్తం రూ.1.66 కోట్లు వారి ఖాతాలకు బదిలీ చేశారు. అయితే.. ఎంతకీ డబ్బు తిరిగి రాకపోవడంతో, అవతలి వ్యక్తులు స్పందించకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు చివరకు నేరెడ్మెట్ పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.