![](https://www.bigtvlive.com/wp-content/uploads/2023/12/48ea3e6f887cf74cbff9dd2a13d81bd2.jpg)
Revanth Reddy Malkajgiri | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మల్కాజిగిరి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ రోజు ఢిల్లీ వెళ్లి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు రాజీనామా లేఖను సమర్పించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాశారు. లేఖ రాస్తూ ఆయన భావోద్వేగాలను ప్రదర్శించారు.
తనను దేశానికి పరిచయం చేసింది మల్కాజిగిరి ప్రజలేనని రేవంత్ రెడ్డి రాశారు. తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు మల్కాజిగిరి నియోజకవర్గానికి కూడా ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. ఎంపీగా గెలిపించిన మల్కాజిగిరి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ.. వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు.
2019 లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి.. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచి బరిలో దిగి ఘన విజయం సాధించారు. విజయం తరువాత కాంగ్రెస్ శాసన సభా పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టారు. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించినందున లోక్ సభ సభ్యత్వాన్ని రేవంత్ రెడ్డి వదులుకున్నారు.