Rohit Reddy: ఈడీ విచారణకు హాజరైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 6 గంటల పాటు తనను ప్రశ్నించిన ఈడీ.. అసలు ఏ కేసు విషయంలో తనను విచారిస్తున్నారో అడిగితే తనకు సమాధానం చెప్పలేదన్నారు. ఈడీ తనను ప్రశ్నించడం కాదు.. కేసు ఏంటో చెప్పాలంటూ తానే ఈడీని ప్రశ్నించినట్టు రోహిత్ రెడ్డి చెప్పారు. తాను కేసేంటో చెప్పాలని ఎన్నిసార్లు అడిగినా.. ప్లీజ్ కోఆపరేట్ విత్ అజ్.. అని మాత్రమే అన్నారని రోహిత్ రెడ్డి మీడియాకు తెలిపారు.
తనకు ముందుగా ఇచ్చిన ఫార్మాట్ ప్రకారమే.. తన బయోడేలా, వ్యాపార లావాదేవీలు, ఆస్తుల వివరాలు మాత్రమే అడిగారని అన్నారు. పాన్ కార్డు, పాస్ పోర్టు, ఆధార్ కార్డు కాపీలను తీసుకున్నారని చెప్పారు. ఈడీకి తాను పూర్తిగా సహకరించానని.. అన్నీ మామూలు ప్రశ్నలేనని.. అయినా, మంగళవారం ఉదయం పదిన్నరకు మరోసారి విచారణకు రావాలన్నారని రోహిత్ రెడ్డి చెప్పారు.