SPDCL Corruption: తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : ప్రతినెలా లక్షల్లో జీతాలు తీసుకుంటున్న దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఇంజినీర్ల అవినీతి బాగోతాన్ని ఫోన్ పే బయటపెట్టింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు వివిధ సాంకేతిక అంశాలను సాకుగా చూపించి వినియోగదారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడి డిస్కం యాంటీ బ్రైబరీ సెల్ కు అడ్డంగా బుక్కయ్యారు. అవినీతి అక్రమ వసూళ్లకు సంబంధించి దాదాపు 150కి పైగా ఫిర్యాదులు అందాయి. వీటిపై డిస్కం విజిలెన్స్ విచారణకు ఆదేశించగా విస్తుగొలిపే అంశాలు బయటపడ్డాయి. దాదాపు 36 మందిపై వేటు పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా తొలుత ఈ విచారణలో అవినీతికి పాల్పడ్డారని రుజువు కావడంతో 8 మందిని సస్పెండ్ చేస్తూ ఎస్పీడీసీఎల్ సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. మిగతావారి సస్పెన్షన్ ఉత్తర్వులు అతి త్వరలోనే బయటకు వచ్చే అవకాశముందని సమాచారం.
Also Read: Washing Machine Tips: మీ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందా? ఈ తప్పులు చేయకండి.. చేశారో మర్నాడు షెడ్డుకే!
కొత్త విద్యుత్ కనెక్షన్లు, లైన్ షిఫ్టింగ్ పనులు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మార్ల మంజూరు, ప్యానల్ బోర్డులు, లైన్ల విస్తరణ పనుల కోసం ప్రతినెలా 35 వేలకు పైగా దరఖాస్తులు డిస్కంలకు అందుతున్నాయి. వినియోగదారుల దరఖాస్తు సమయంలోనే వీటికి సంబంధిచిన పూర్తి ఫీజులు చెల్లిస్తారు. క్షేత్రస్థాయిలోని కొంత మంది లైన్ మెన్లు, ఏఈలు, ఏడీఈలు చిన్న చిన్న సాంకేతిక అంశాలను సాకుగా చూపించి పనులు ముందుకు వెళ్లకుండా అడ్డుతగులుతుంటారు. ఇక్కడే మధ్య వర్తులు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తుంటారు. చేయి తడిపితే తప్పా.. పనులు ముందుకు కదలని పరిస్థితి. దీంతో ఎలాగైనా పనిని తర్వగా పూర్తిచేయించుకోవాలనే ఉద్దేశ్యంతో వినియోగదారులు వారడిగినంత ముట్టజెప్పాల్సి వస్తోంది. ఈ అదనపు చెల్లింపులు ఇష్టంలేని కొంతమంది డిస్కం యాంటీ బ్రైబరీ సెల్ ను ఆశ్రయిస్తున్నారు. ఇలా యాంటీ బ్రైబరీ సెల్ ఏర్పాటుచేసిన ఏడాది కాలంలో దాదాపు 200కు పైగా ఫిర్యాదులు అందాయి. వాటిలో 150 వరకు ఫిర్యాదులను విజిలెన్స్ విభాగం విచారణ పూర్తిచేసింది.
భువనగిరి డివిజన్ ఏడీఈ.. ఈవీ కనెక్షన్ కోసం డబ్బులు డిమాండ్ చేయగా వినియోగదారుడు రూ.5 వేలు సదరు ఏడీఈకి ఫోన్ పే చేసినట్లు విచారణలో తేలింది. ఈయనతో పాటు మరికొంతమంది లైన్ మెన్లు, ఏఈలు, ఏడీఈలు ఉన్నట్లు తేలింది. వీరిపై యాక్షన్ తీసుకోవాలని సీఎండీ హెచ్ ఆర్ విభాగానికి ఆదేశించారు. అయినా చర్యలు తీసుకోకపోగా ఉపేక్షించడంతో ఇటీవల ఇదే అంశంపై సీఎండీ హెచ్ ఆర్ విభాగంపై సీరియస్ అయ్యారు. దీంతో హెచ్ ఆర్ విభాగం 8 మంది అక్రమార్కులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా మిగతా వారిపైనా వేటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా భవిష్యత్ లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. డిస్కం చరిత్రలో ఇంత మందిపై వేటు వేయడం ఇదే తొలిసారి.
Also Read: eddapalli CrimeP: గోదావరి ఖనిలో కత్తిపోట్ల కలకలం.. కత్తులతో కుటుంబసభ్యుల దాడులు