Chicken Rates Increase: వేసవి తాపం పెరుగుతున్న నేపథ్యంలో చికెన్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా మార్కెట్ లో కోడి మాంసం ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. సామాన్య ప్రజలు చికెన్ కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. గత కొద్ది రోజుల వరకు కిలో స్కిన్తో చికెన్ రూ.260 వరకు ఉండేది. ఇప్పుడు అదే ధర రూ.310 నుంచి రూ.320 వరకు చేరింది. స్కిన్ లెస్ చికెన్ పరిస్థితి కూడా ఇదేలా ఉంది. ముందుగా రూ.280 ఉన్న ధర ప్రస్తుతం రూ.350 నుంచి రూ.360 వరకు పెరిగింది.
ధరలు ఒక్కసారిగా పెరగడంతో చికెన్ ప్రియులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకుముందు రెండు కిలోలు కొనేవారు ఇప్పుడు ఒక కిలోతో సరిపెట్టుకుంటున్నారు. ఒక కిలో కొనేవారు అర కిలో మాత్రమే తీసుకుంటున్నారు. వేసవి ముగిసే వరకు ఈ ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటున్నారు చికెన్ వ్యాపారులు. ముఖ్యంగా జూన్ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు.
చికెన్ ధరలు పెరగడానికి ప్రధాన కారణం విపరీతమైన ఎండలు. తీవ్రమైన వేడి కారణంగా కోళ్ల ఫారమ్ లలో పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. బ్రాయిలర్ కోళ్లు ఎక్కువ వేడిని తట్టుకోలేవు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటితే కోళ్లు అనారోగ్యానికి గురవుతాయి. చాలా వరకు చనిపోతాయి. ప్రస్తుతం తెలంగాణలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఫారమ్ లలో కోళ్లను రక్షించడానికి రైతులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫారామ్ చుట్టూ జాలీలు కట్టి వాటిపై నీళ్లు చల్లడం, ఫ్యాన్లు పెట్టడం వంటి చర్యలు చేపడుతున్నారు. అయినా కూడా ఎండ తీవ్రత కారణంగా నష్టాలు తప్పడం లేదు. విద్యుత్ సరఫరా ఆగిపోయినా కోళ్లు చనిపోతున్నాయని రైతులు చెబుతున్నారు.
వేసవిలో కోడిపిల్లల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఒక్కో కోడిపిల్ల ధర ప్రస్తుతం రూ.50 నుంచి రూ.60 వరకు ఉంది. వేసవి వేడి కారణంగా చిన్న కోడిపిల్లలు ఎక్కువగా చనిపోతుండటంతో రైతులు పెద్ద సంఖ్యలో వాటిని పెంచేందుకు ముందుకు రావడం లేదు. ఇంతకుముందు ఒక ఫాంలో 20 వేల వరకు కోడిపిల్లలను పెంచేవారు. ఇప్పుడు అదే రైతులు 5 వేల నుంచి 10 వేల మధ్య మాత్రమే పెంచుతున్నారు. దీంతో మొత్తం ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. మార్కెట్కు వచ్చే కోళ్ల సంఖ్య మరింత తగ్గుతోంది. సరఫరా తగ్గి, డిమాండ్ మాత్రం అలాగే ఉండటంతో చికెన్ ధరలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే, వేసవి తగ్గే వరకు ధరలు తగ్గే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.
Read Also: రైతన్నలకు పిడుగులాంటి వార్త.. మళ్లీ పెరిగిన ధరలు..?