Tamilisai: రాజ్భవన్కు ప్రగతి భవన్కు అస్సలు పొసగడం లేదు. కేసీఆర్, తమిళిసై నువ్వా నేనా అనేలా తలపడుతున్నారు. రెండు రాజ్యాంగ సంస్థల మధ్య ఆధిపత్య పోరు సుస్పష్టం. ఒకటి రెండు కాదు.. అనేకసార్లు గిల్లికజ్జాలు పెట్టుకున్నారు. అవమానాలు, విమర్శలు, కోర్టుల వరకూ వైరం పెరిగిపోయింది. తెలంగాణలో ఏ ఈవెంట్ జరిగినా.. అందులో గవర్నర్ తమిళిసై పరాభవం తప్పటం లేదు. ఆ తర్వాత ఆమె నుంచి మండిపాటూ కామన్గా మారింది.
లేటెస్ట్గా అట్టహాసంగా కొత్త సచివాలయాన్ని ఆరంభించారు సీఎం కేసీఆర్. సెక్రటరియేట్ అంటే రాష్ట్ర పరిపాలనా కేంద్రం. అలాంటి రాజ్యాంగ ఏర్పాటుకు.. రాష్ట్ర ప్రథమ పౌరురాలైన గవర్నర్ను ఆహ్వానించక పోవడం ఆ హోదాను అవమానించడమే అంటున్నారు. అసలే రాజ్భవన్తో లొల్లి లొల్లి జరుగుతోంది. తమిళిసైని అసలు ఖాతరు చేయడం లేదు కేసీఆర్. ప్రోటోకాల్ ముచ్చటే లేదు. ఇంతటి వివాదం మధ్యలో గవర్నర్ను కొత్త సచివాలయ ఓపెనింగ్కు పిలవకపోవడంతో మరోసారి ఇష్యూగా మారింది.
ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు మైండ్ గేమ్ కూడా ఆడారు. గవర్నర్ రాకపోవడం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. అదేంటి? తనను ఎవరూ పిలవనేలేదు.. పైగా తానే రాలేదన్నట్టు ప్రచారం చేస్తున్నారేంటి? అంటూ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మేరకు రాజ్భవన్ ఓ ప్రకటన కూడా రిలీజ్ చేసింది.
కట్ చేస్తే.. ఈసారి స్వయంగా గవర్నరే హాట్ కామెంట్స్ చేశారు. జీ-20 సమావేశాల్లో భాగంగా హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన సి-20 సమాజ్శాల కార్యక్రమంకు హాజరైన గవర్నర్.. కేసీఆర్ పేరు ప్రస్తావించకుండా విమర్శలు చేశారు.
అభివృద్ధి అంటే ఒక్క కుటుంబం కోసం కాదని .. అందరూ అభివృద్ధి చెందాలన్నారు. కొంతమంది మాట్లాడుతారు కానీ, పని చేయరు.. దేశాధినేతలనైనా కలవొచ్చు కానీ, ఈ స్టేట్ చీఫ్ని మాత్రం కలవలేం.. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదని.. ప్రగతి భవన్, రాజ్భవన్ దూరంగా ఉంటున్నాయని ఓపెన్గానే చెప్పేశారు గవర్నర్ తమిళిసై.