Chandrababu: సీఎం జగన్ ఉత్తరాంధ్రలో కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. భోగాపురం ఎయిర్పోర్టు, అదానీ డేటా సెంటర్ తదితర పనులకు శ్రీకారం చుట్టారు. కట్ చేస్తే, టీడీపీ అధినేత చంద్రబాబు మంగళగిరిలో ప్రెస్మీట్ పెట్టారు. జగన్ చేపట్టిన చర్యలకు కౌంటర్ అటాక్ ఇచ్చారు. ఇంతకీ చంద్రబాబు ఏమన్నారంటే…
వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. రాష్ట్రంలో రివర్స్ పాలన సాగుతోందని విమర్శించారు. రివర్స్ పాలనలో కూడా గేర్లు మారుస్తున్నారని.. వ్యవస్థలన్నీ పతనావస్థకు చేరాయని ఆక్షేపించారు. జగన్ పాలనలో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయాయని మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఏపీకి ఎన్నో అవార్డులు తీసుకొచ్చామని.. అన్నిరంగాల్లో ఆనాడూ ఏపీని నెంబర్ వన్ స్టేట్గా నిలిపామని చెప్పారు. కన్ను ఆర్పకుండా అబద్దాలు చెప్పడంలో జగన్ అరితేరారని విమర్శించారు.
అదానీ డేటా సెంటర్కు ఆ రోజు ఫౌండేషన్ వేశామని, ఇప్పుడు సీఎం జగన్ మళ్లీ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు చంద్రబాబు. ప్రభుత్వం మారాక వేలాది కోట్ల పెట్టుబడులు వెనక్కు వెళ్లాయని, ఆ పాపం ఎవరిదని ప్రశ్నించారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం జగన్ రెండుసార్లు శంకుస్థాపన చేశారని.. ఇవేం తిక్క పనులంటూ మండిపడ్డారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు అవసరమే లేదన్న జగన్.. ఇప్పుడు భోగాపురం ఉత్తరాంధ్రకు కిరీటం, వజ్రం అంటున్నారని దెప్పిపొడిచారు. నాడు భోగాపురం ఎయిర్పోర్టును జగన్ వద్దన్నారని, భూములు తిరిగిచ్చేస్తామని చెప్పారని.. ఇప్పుడు అద్భుతం అంటున్నారని మండిపడ్డారు. ఏ ఒక్క విషయంలోనైనా ఈ ఊసరవెల్లికి క్లారిటీ ఉందా? అంటూ ఫైర్ అయ్యారు. భావనపాడు పోర్టు అంటే టీడీపీ గుర్తొస్తుందని.. మూలపాడు పోర్టు అని పేరు మార్చారని మండిపడ్డారు చంద్రబాబు.
రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని.. యువత నిరాశకు లోనయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సన్ రైజ్ ఏపీ అనే పేరుతో ఏపీలో పెట్టుబడులని ఆకర్షించామని, వివిధ రంగాల్లో ఏపీని నెంబర్-1గా నిలిపామన్నారు. తమ హయాంలో కృష్ణపట్నం నుంచి భావనపాడు వరకు పోర్టుల అభివృద్ధి చేపట్టామని.. 16 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని.. విశాఖలో మూడు సార్లు సీఐఐ సదస్సులు పెట్టామని చంద్రబాబు అన్నారు. కేంద్ర విడుదల చేసిన లెక్కల ప్రకారం పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ అధోగతికి వెళ్లిపోయిందని.. ఈ విషయంలో సీఎం జగన్కు సిగ్గు అనిపించడం లేదా? అని నిలదీశారు చంద్రబాబు.