తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా కొందరు కార్మికులు క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతుండటంపై ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రాణాలు తీసుకోవడం వల్ల ఏ సమస్య పరిష్కారం కాదు.. మీ కుటుంబాలను అనాథలను చేయకండి.” అని ఆయన కార్మికులకు విజ్ఞప్తి చేశారు.
సమ్మె డెడ్లాక్ను తొలగించడానికి ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఒక మంత్రుల బృందాన్ని సీఎం నియమించారు. రేపు (శుక్రవారం) ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను చర్చలకు పిలవాలని, వారి డిమాండ్లపై సానుకూల వాతావరణంలో చర్చలు జరపాలని భట్టి విక్రమార్కను సీఎం ఆదేశించారు. ప్రభుత్వం కార్మికుల పక్షానే ఉందని, సంయమనం పాటించి వెంటనే సమ్మె విరమించాలని సీఎం పిలుపునిచ్చారు.
మరోవైపు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా ఆర్టీసీ కార్మికులకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. కార్మికులు ఆత్మనిబ్బరంతో ఉండాలని, ప్రేరేపిత శక్తుల ఒత్తిడికి లోనై ప్రాణాలు తీసుకునే అనాలోచిత చర్యలకు పాల్పడవద్దని కోరారు. “క్షణికావేశం కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది.. మీ వెనుక ఉన్న కుటుంబాలను దృష్టిలో పెట్టుకోండి.” అని ఆయన గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి చర్చలే ఏకైక మార్గమని, ప్రభుత్వం అందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
ప్రభుత్వం ఇప్పటికే 29 డిమాండ్లకు సానుకూలంగా ఉన్నట్లు ప్రకటించిన నేపథ్యంలో, కార్మిక సంఘాల నేతలు కూడా మొండిపట్టు వీడి చర్చలకు రావాలని మంత్రులు కోరుతున్నారు. ప్రజారవాణా వ్యవస్థ స్తంభించిపోవడం వల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం ఆశిస్తోంది. రేపు జరిగే చర్చల ఫలితంపైనే ఆర్టీసీ భవిష్యత్తు, కార్మికుల ఆశలు ఆధారపడి ఉన్నాయి.
Read Also: ఆర్టీసీ సమ్మె సస్పెన్స్.. 29 డిమాండ్లకు సర్కార్ ఓకే.. ఆ మూడింటిపైనే పీటముడి!