Telangana Excise revenue: తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదాయం సరికొత్త రికార్డులను సృష్టించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఆదాయాన్ని ఆర్జించి ఎక్సైజ్ శాఖ భళా అనిపించుకుంది. ఈ ఏడాది మొత్తం రూ. 44,557 కోట్ల భారీ ఆదాయం ప్రభుత్వ ఖజానాకు సమకూరింది. ఇందులో కేవలం మద్యం అమ్మకాల ద్వారానే రూ. 40,209 కోట్లు రాగా మిగిలిన ఆదాయం లైసెన్స్ ఫీజులు బార్ల ద్వారా వచ్చినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఎక్సైజ్ ఆదాయం 7 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం.
రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి విశ్లేషిస్తే ఎక్సైజ్ ఆదాయం అసాధారణ రీతిలో పెరుగుతూ వస్తోంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 20,859 కోట్లుగా ఉన్న ఆదాయం కేవలం ఏడేళ్ల కాలంలోనే రెట్టింపు కావడం గమనార్హం. 2024-25లో మద్యం అమ్మకాల ద్వారా రూ. 37,487 కోట్లు రాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది రూ. 40,209 కోట్లకు చేరింది. అంటే గత ఏడాదితో పోలిస్తే రూ. 2,722 కోట్ల మేర అదనపు అమ్మకాలు జరిగాయి. తెలంగాణ చరిత్రలో మద్యం ద్వారా వచ్చే ఆదాయం రూ. 40 వేల కోట్ల మార్కును దాటడం ఇదే తొలిసారి.
మద్యం అమ్మకాల రకాలను పరిశీలిస్తే 2025-26లో 382.91 లక్షల కేసుల లిక్కర్ 387.34 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే లిక్కర్ అమ్మకాలు 2 శాతం పెరగగా బీరు విక్రయాలు మాత్రం 9 శాతం మేర తగ్గుముఖం పట్టాయి. 2024-25లో 536.13 లక్షల కేసుల బీర్లు అమ్ముడవగా ఈసారి ఆ సంఖ్య తగ్గడం గమనార్హం. కేవలం మద్యం విక్రయాలే కాకుండా రాష్ట్రంలోని 2,620 ఏ-4 మద్యం షాపుల రెంటల్ ఫీజు ద్వారా రూ. 1,771 కోట్లు 1,214 బార్ల ద్వారా రూ. 549 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి అందింది. కొత్తగా వచ్చిన 95,628 దరఖాస్తుల ద్వారా అదనంగా రూ. 2,869 కోట్లు లభించాయి.
నెలవారీ ఆదాయాన్ని గమనిస్తే డిసెంబర్ మాసంలో రికార్డు స్థాయి విక్రయాలు జరిగాయి. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో డిసెంబర్లో అత్యధికంగా రూ. 5,051 కోట్ల ఆదాయం వచ్చింది. మిగిలిన నెలల్లో సగటున రూ. 3 వేల కోట్ల నుంచి రూ. 3,500 కోట్ల మధ్య విక్రయాలు సాగాయి. ఏప్రిల్లో రూ. 3,272 కోట్లు మే నెలలో రూ. 3,561 కోట్లు విక్రయాలు జరగ్గా అక్టోబర్లో అత్యల్పంగా రూ. 2,709 కోట్ల ఆదాయం నమోదైంది. 2026 మార్చి నాటికి విక్రయాలు మళ్ళీ పుంజుకుని రూ. 3,486 కోట్లకు చేరాయి.
తెలంగాణ ఏర్పడిన తొలి ఏడాది 2015-16లో ఎక్సైజ్ ఆదాయం కేవలం రూ. 12,706 కోట్లు మాత్రమే ఉండేది. 2021-22లో రూ. 30,783 కోట్లు ఉన్న ఆదాయం ప్రతి ఏడాది పెరుగుతూ ప్రస్తుత స్థాయికి చేరుకుంది. పదేళ్ల కాలంలోనే ఈ ఆదాయం మూడింతల కంటే ఎక్కువగా పెరగడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మద్యం పోషిస్తున్న కీలక పాత్రను తెలియజేస్తోంది.
Read Also: ఏం తాగుడు భయ్యా ఇది.. ఒక్కే రోజే రూ.410 కోట్ల విలువైన బీర్లు తాగేశారు