Gaushala Policy: గోశాలల సంరక్షణకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం గోశాల పాలసీని త్వరలోనే తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తుందని తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ వెల్లడించారు. హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంకు సమీపంలోని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో మంగళవారం పశుసంవర్ధకశాఖ, తెలంగాణ గోశాల సేవ సమితి సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల గోశాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చరణ్ కౌశిక్ యాదవ్ మాట్లాడుతూ వ్యవసాయ అనుంబంధరంగమైన పశుసంవర్ధక శాఖపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందన్నారు. ఓ వైపు పాడిరైతుల సంక్షేమానికి కృషిచేస్తుందన్నారు. అదే విధంగా రాష్ట్రంలోని నాలుగు గోశాలలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఎనికపల్లిలో 99 ఎకరాల్లో రూ.157కోట్లతో, వేములవాడలో 100 ఎకరాలలో, యాదగిరిగుట్ట, వెటర్నరీ యూనివర్సిటీలో గోశాలలు ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు.
రాష్ట్రంలో 2216 కోట్లతో దేవాలయాల పునర్నిర్మాణం జరుగుతుందని ఆయన తెలిపారు. గోదావరి పుష్కరాలకు రూ.1000 కోట్లు కేటాయించి హిందూ సనాతన ధర్మాన్ని ప్రజల విశ్వాసాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాపాడుతుందన్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేయలేదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.
Also Read: లూలూ మాల్లో గన్ కలకలం.. రంగంలోకి పోలీసులు.. అసలేం జరిగిందంటే?
ఈ సమావేశంలో పలువురు సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గోశాలల కొరకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. పశుసంవర్ధకశాఖ బోర్డు తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు. అదే విధంగా ప్రకృతి వైద్యాన్ని ప్రోత్సహించాలని, గోమాత ఉత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, గోవును తెలంగాణ కల్చరల్ యానిమల్ గా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ గోపి, తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.
Also Read: సముద్రపు సొరచేపలు.. టెక్నాలజీకి గొప్ప వరం.. ఈ ఆవిష్కరణలు చూస్తే మైండ్ బ్లాకే!