GHMC Property Tax: కోర్ అర్బన్ రీజియన్ ప్రజలకు అత్యవసర, పౌర సేవలందిస్తున్న మూడు కార్పొరేషన్ల పరిధిలో ఒకే ప్రాపర్టీ ట్యాక్స్ యూనిఫామ్ విధానాన్ని అమలు చేసే దిశగా అధికార యంత్రాంగం అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. ఇటీవలే పునర్ వ్యవస్థీకరించిన జీహెచ్ఎంసీ పరిధిలోని పాత ప్రాంతాల్లో రెంటల్ ఆధారిత ప్రాపర్టీ ట్యాక్స్ విధానాన్ని అమలు చేస్తుండగా, విలీన పట్టణ స్థానిక సంస్థల పరిధిలో రిజిస్ట్రేషన్ మార్కెట్ వ్యాల్యుయేషన్ ప్రకారం ప్రాపర్టీ ట్యాక్స్ ను అమలు చేస్తున్నారు. దీంతో మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని పాత పరిధుల్లో ఒక విధానం, విలీన పట్టణ స్థానిక సంస్థల్లో మరో విధానం అమలవుతుంది. గత సంవత్సరం నవంబర్ 25వ తేదీన కోర్ అర్బన్ రీజియన్ లోని 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం ఆదేశాలకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఆయా స్థానిక సంస్థల్లోని ఆస్తులు, ఆదాయాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో అధికారులు పట్టణ స్థానిక సంస్థల్లో రిజిస్ట్రేషన్ మార్కెట్ వ్యాల్యూ ఆధారిత ప్రాపర్టీ ట్యాక్స్ విధానం అమలవుతున్నట్లు గుర్తించారు.
అప్పటి వరకు జీహెచ్ఎంసీ పాత పరిధిలోని 30 సర్కిళ్లలో మొత్తం 19.50 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నెంబర్లు (పీటీఐఎన్ ) ఖాతాలుండేవి. పట్టణ స్థానిక సంస్థల విలీనం కావటంతో వాటిలోని దాదాపు మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షల వరకున్న పీటీఐఎన్ లను జీహెచ్ఎంసీలోకి విలీనం చేయటంతో మొత్తం పీటీఐఎన్ నెంబర్ల సంఖ్య సుమారు 23 లక్షల పై చిలుకు పెరిగాయి. విలీన ప్రాంతాల్లోనూ పాత మార్కెట్ వ్యాల్యుయేషన్ ప్రకారమే ఆస్తి పన్ను వసూలు చేస్తూ వచ్చారు. ఆ తర్వాత మూడు కార్పొరేషన్లుగా విడిపోయిన తర్వాత 150 వార్డులు, 858 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పడిన జీహెచ్ఎంసీ పరిధిలోని సుమారు 23 లక్షల పై చిలుకు పీటీఐఎన్ నెంబర్లలో జీహెచ్ఎంసీకి సుమారు 11 లక్షల పీటీఐఎన్ నెంబర్లు పునర్ వ్యవస్థీకరణలో భాగంగా కేటాయించగా, మిగిలిన 12 లక్షల పై చిలుకు పీటీఐఎన్ నెంబర్ల ను సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు కేటాయించారు.
Also Read: Today Horoscope in Telugu: ఆ రాశి వారికి దాయాదులతో సమస్యలు – వ్యాపారులకు లాభాలు
మూడు వేర్వేరుగా కార్పొరేషన్లుగా, వెర్వేరు టార్గెట్లతో ప్రస్తుతం ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ జరుగుతున్నా, మూడు కార్పొరేషన్లలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న జీహెచ్ఎంసీ ఖాతాలోనే ట్యాక్స్ చెల్లింపులు జమ అవుతున్నాయి. మూడు కార్పొరేషన్లలోనూ కొన్ని ఆస్తుల నుంచి రెంటల్ ఆధారిత ప్రాపర్టీ ట్యాక్స్ విధానం, మరి కొన్నింటిలో మార్కెట్ వ్యాల్యుయేషన్ విధానాలు అమలవుతున్నాయన్న విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సర్కారు దృష్టికి తీసుకెళ్లగా, వర్తమాన ఆర్థిక సంవత్సరం (2025-26) చివరి కల్లా ఇదే విధానాన్ని కొనసాగించాలని సర్కారు ఆదేశించినట్లు తెలిసింది. దీనికి సమాంతరంగా ఈ రెండు ట్యాక్స్ సిస్టమ్ లలో జీహెచ్ఎంసీకి, సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ల వారీగా ఏ కార్పొరేషన్ కు ఏ విధానం వర్తిస్తుందన్న విషయంపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. అధికారులు ఎన్ని సిఫార్సులు చేసినా, పన్ను వర్తింపు, వసూల్లకు అనుసరించాల్సిన విధానంపై సర్కారుదే తుది నిర్ణయమని తెలిసింది.
జీహెచ్ఎంసీలోకి విలీనమైన పట్టణ స్థానిక సంస్థల ప్రాపర్టీ ట్యాక్స్ ప్రస్తుతం మార్కెట్ వ్యాల్యుయేషన్ ప్రకారం వసూలు చేస్తుండగా, ఆ విధానం అక్కడ ప్రాపర్టీ యజమానులకు భరించదగ్గ విషయంగా మారి, దీనిపై పెద్దగా అభ్యంతరాలేమీ లేవు. కానీ పాత జీహెచ్ఎంసీ పరిధిలో అమలు చేస్తున్న రెంటల్ వ్యాల్యు విధానాన్ని మూడు కార్పొరేషన్లలో యూనిఫామ్ గా అమలు చేస్తే ఎలాంటి పరిణామాలెదురవుతాయి? ట్యాక్స్ చెల్లింపు దారిపై ఎలాంటి భారం పడుతుందన్న విషయాన్ని కూడా అధికారులు అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. విలీన ప్రాంతాల్లోని రిజిస్ట్రేషన్ మార్కెట్ వ్యాల్యుయేషన్ విధానాన్ని ఒక వేళ మూడు కార్పొరేషన్ల పరిధిలో అమలు చేస్తే కోర్ సిటీ ఆస్తుల యజమానులపై పన్ను భారం బాగా పరిగే అవకాశముంది. అదే రెంటల్ వ్యాల్యూ ప్రకారం ప్రస్తుతం కోర్ సిటీలో అమలు చేస్తున్న విధానాన్ని మూడు కార్పొరేషన్లలో యూనిఫామ్ గా అమలు చేస్తే విలీన ప్రాంతాల ప్రాపర్టీల యజమానులకు ట్యాక్స్ భారీగా తగ్గే అవకాశామున్నందున కొత్త ఆర్థిక సంవత్సరంలో మూడు కార్పొరేషన్లలో సర్కారు ఎలాంటి యూనిఫైడ్ ట్యాక్స్ సిస్టమ్ ను అమల్లోకి తేనుందన్న విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Also Read: Tirumala: తిరుమల క్యూలైన్లో ఉద్రిక్తత.. పొట్టు పొట్టు కొట్టుకున్న భక్తులు.. వీడియో వైరల్