TG Govt: తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు సంక్రాంతి కానుక ప్రకటించింది. గ్రామాల అభివృద్ధి, ఇతర పనులకు రూ.277 కోట్ల నిధులను విడుదల చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో.. ఆర్థికశాఖ నిధులను విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచ్లు, వార్డు మెంబర్లకు భట్టి విక్రమార్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా విడుదలైన విధులతో గ్రామాల్లో పెండింగ్ పనులు పూర్తి కావడమే కాకుండా, పంచాయతీల నిర్వహణ ఊతం లభించనుంది. నిధుల విడుదలపై స్థానిక సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. మెజారిటీ పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయ సాధించారు. కొత్త సర్పంచ్ లు నిధుల కొరతతో ఇబ్బందులు పడకుండా, గ్రామ స్థాయి అభివృద్ధి పనులు ఆగిపోకుండా ప్రభుత్వం నిధులను సమకూర్చింది. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు, వీధి దీపాలు, గ్రామీణ మౌలిక సదుపాయాలకు ఈ నిధులను వినియోగించనున్నారు. పండుగ వేళ నిధుల విడుదలతో గ్రామ స్థాయి ప్రతినిధుల్లో ఉత్సాహాన్ని నింపింది.
ఇటీవల ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు, వార్డు మెంబర్లు బాధ్యతలు చేపట్టిన వెంటనే నిధులు రావడంతో గ్రామ పాలన సుగమం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక అవసరాలకు, గ్రామాభివృద్ధి పనులకు ఆటంకం లేకుండా ఈ నిధులు వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలకు నేరుగా ఉపయోగపడే మౌలిక సదుపాయలకు ఈ నిధులు ఖర్చు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ప్రజాభవన్లో ఆర్థిక శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. నిధుల విడుదలు, ఖర్చులు, పర్యవేక్షణ వ్యవస్థపై ఈ భేటీలో చర్చించారు.
Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ భారీ గుడ్ న్యూస్.. సంక్రాంతి కానుక మామూలుగా లేదుగా..!