ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ మరోసారి కీలకం కాబోతున్నారు. గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నట్లు కనిపించినా.. ఇప్పుడు రాబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆమె తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రియాంక గాంధీ 54వ పుట్టినరోజును పురస్కరించుకుని యూపీ కాంగ్రెస్ యూనిట్ రాష్ట్రవ్యాప్తంగా ‘పరివర్తన ప్రతిజ్ఞ’ అనే భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాకుండా.. ప్రజల్లోకి బలంగా వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది.
గత సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ప్రియాంక గాంధీ ప్రభావం యూపీపై స్పష్టంగా కనిపించింది. ఒకవేళ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెరుగైన ఫలితాలు వచ్చి ఉంటే, ఆమె ముఖ్యమంత్రి పగ్గాలు చేపడతారని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే, అప్పట్లో సమీకరణలు వేరేలా ఉన్నప్పటికీ.. ఇప్పుడు 2027 అసెంబ్లీ ఎన్నికల నాటికి పరిస్థితి పూర్తిగా మారుతుందని కాంగ్రెస్ నాయకత్వం నమ్ముతోంది. ప్రియాంక నాయకత్వంపై నమ్మకంతో ఉన్న పార్టీ శ్రేణులు, ఆమెనే తదుపరి సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.
ప్రస్తుతం యూపీలో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకోవడానికి ప్రియాంక గాంధీని ‘ఫేస్’గా ప్రొజెక్ట్ చేయడం అత్యవసరమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ శ్రేణుల నుండి వస్తున్న డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటే.. హైకమాండ్ కూడా ఆమెను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. ఈ లోపే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ‘పరివర్తన ప్రతిజ్ఞ’ వంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి.. ప్రియాంక గాంధీ సారథ్యంలో ఉత్తరప్రదేశ్లో పూర్వ వైభవం సాధించాలని కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉంది. యువత, మహిళలు, అణగారిన వర్గాలను ఆకర్షించే విధంగా ఆమె తన ప్రసంగాలు పర్యటనలను ప్లాన్ చేస్తోంది. 2027 ఎన్నికల యుద్ధానికి ప్రియాంక గాంధీని సేనాధిపతిగా నిలబెట్టి విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహకర్తలు ప్రణాళికలు రచిస్తున్నారు.
ALSO READ: KTR: ఇది రేవంత్ సర్కార్ పాలన.. కేటీఆర్ సంచలన ట్వీట్, భారీ మూల్యం తప్పదంటున్న కాంగ్రెస్ శ్రేణులు