Hyderabad: తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ-ఎయిడెడ్-ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలు నేటి నుంచి మొదలయ్యాయి. తరగతులు మాత్రం జూన్ ఒకటి నుంచి మొదలుకానున్నాయి. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి స్వయంగా వెల్లడించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక..
తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ తొలి ఇయర్ ప్రవేశాల షెడ్యూల్ను సవరించింది ఇంటర్ బోర్డు. మే 12న అనగా మంగళవారం నుంచి అడ్మిషన్ల ప్రక్రియ మొదలుకానుంది. ఈసారి అడ్మిషన్ల ప్రక్రియలో కొన్ని మార్పులు చేసింది. కొత్తగా కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది.
గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 8 ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కావాలి. కొన్ని కారణాల వల్ల అది కాస్తా వాయిదా పడింది. తాజాగా ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ అడ్మిషన్లకు సంబంధించి వివరాలు వెల్లడించారు. మే 12న అనగా ఇవాళ నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు జరగనున్నట్లు తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ అడ్మిషన్లు నేటి నుంచి.. తరగతులు జూన్ ఒకటి నుంచి ప్రారంభం
ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలని ఆలోచన చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నిర్ణయంపై విద్యా సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇంటర్ ఫస్టియర్ జాయిన్ అయ్యే విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా పాత విధానంలో ప్రవేశాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది బోర్డు.
అడ్మిషన్ల ప్రక్రియలో రెండు నిబంధనలను చాలా సీరియస్గా అమలు చేస్తోంది ప్రభుత్వం. ఒకటి ఆధార్ కార్డు కాగా, మరొకటి యాంటీ డ్రగ్ అఫిడవిట్ ఇవ్వాలన్నది ప్రధాన నిర్ణయం. విద్యార్థి అడ్మిషన్ పొందే సమయంలో ఆధార్ను సమర్పించడం తప్పనిసరి చేసింది.
ALSO READ: మళ్ళీ రాజుకుంటున్న పోలవరం వివాదం.. ఫేజ్-2 పనులు ఆపాలని పీపీఏకు తెలంగాణ సర్కార్ లేఖ!
పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు అడ్మిషన్ సమయంలో విద్యార్థితో పాటు వారి తల్లిదండ్రులు తాము మత్తు పదార్థాలను వినియోగించబోమని, అలాగే విక్రయించబోమని రాసిన అఫిడవిట్పై సంతకం చేసి సంబంధిత కళాశాలకు సమర్పించాలి. ఇక ఇంటర్ ఫస్టియిర్ తరగతులు జూన్ ఒకటి నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలల్లో సీట్లను రిజర్వ్ చేసుకోవాలని ఈ సందర్భంగా బోర్డు సూచన చేసింది. నిబంధనల ప్రకారం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అఫిడవిట్లు సమర్పించని పక్షంలో ప్రవేశాలు నిరాకరించవచ్చు.