Polavaram Phase 2 controversy: తెలుగు రాష్ట్రాల మధ్య పోలవరం ప్రాజెక్టు వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ (PIP) ఫేజ్-2 పనులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నీటి పారుదల శాఖ.. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (PPA)కి కీలక లేఖ రాసింది. ఉమ్మడి సర్వే పూర్తి కాకుండా.. ముంపు ప్రభావంపై స్పష్టత రాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనులను ముందుకు తీసుకెళ్లడంపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీ (జనరల్) ఓ.వి. రమేష్ బాబు.. పీపీఏ సీఈఓకు వివరాలతో లేఖ పంపారు.
పోలవరం ప్రాజెక్టును రెండు దశల్లో చేపడుతున్నట్లు గత సమావేశాల్లో నిర్ణయించారని తెలంగాణ గుర్తు చేసింది. మొదటి దశలో 41.15 మీటర్ల మేర (MDDL).. రెండో దశలో 45.72 మీటర్ల మేర (FRL) నీటిని నిల్వ చేయాలని నిర్ణయించారు. అయితే 45.72 మీటర్ల మేర నీటిని నిల్వ చేసినప్పుడు తెలంగాణ భూభాగంలో కలిగే ముంపు.. బ్యాక్ వాటర్ ప్రభావంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉమ్మడి సర్వే జరగాల్సి ఉంది. భద్రాచలం పట్టణంతో పాటు మణుగూరులోని హెవీ వాటర్ ప్లాంట్ వంటి కీలక ప్రాంతాలపై బ్యాక్ వాటర్ ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. కిన్నెరసాని.. ముర్రేడు వాగులతో పాటు గోదావరిలో కలిసే 36 వాగుల డ్రైనేజీ వ్యవస్థపై అధ్యయనం చేయాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది.
ముఖ్యంగా పోలవరం లిఫ్ట్ స్కీమ్ పునఃప్రారంభంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేకుండా.. సంబంధిత అథారిటీల ఆమోదం లేకుండా ఏపీ ప్రభుత్వం ఈ పనులను చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని ఆరోపించింది. ఉమ్మడి సర్వేలో భాగంగా తెలంగాణ భూభాగంలో 954 ఎకరాల మేర ముంపునకు గురయ్యే అవకాశం ఉందని.. ఈ ప్రక్రియ పూర్తి కాకుండా ఫేజ్-2 పనులు చేపట్టడం వల్ల తెలంగాణకు తీరని నష్టం జరుగుతుందని లేఖలో పేర్కొంది. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పనులను నియంత్రించాలని.. నిబంధనల ప్రకారం ఉమ్మడి సర్వే పూర్తయ్యే వరకు పనులను అడ్డుకోవాలని పీపీఏకు విజ్ఞప్తి చేసింది.
మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఏపీ ప్రభుత్వం ఫేజ్-2 పనులకు ప్రాధాన్యత ఇస్తుండటంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భద్రాచలం పరిసరాల్లోని 8 అవుట్ఫాల్ రెగ్యులేటర్లు.. ప్రముఖ దేవాలయాలపై పడే ప్రభావాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుతోంది. ఇప్పటికే కేజీబీఓ (KGBO) ఆధ్వర్యంలో 6 స్థానిక వాగులపై సర్వే జరుగుతున్న తరుణంలో.. ఏకపక్షంగా పనులు చేపట్టడం సరికాదని తెలంగాణ వాదిస్తోంది.
Read Also: 17 రాష్ట్రాలు, 5 యూటీల్లో.. మూడో దశ S.I.Rకి రంగం సిద్ధం