Mega Job Mela: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని మైనారిటీ యువతకు ఆర్థిక సాధికారత, ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక అడుగు వేసిందనీ మంత్రి అజారుద్దీన్ వెల్లడించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా మైనారిటీల సంక్షేమ శాఖ, తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీజీఎంఎఫ్సీ) సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లిలోని రెడ్ రోజ్ ప్యాలెస్లో ఏర్పాటు చేసిన ‘మెగా జాబ్ మేళా’ మంగళవారం అత్యంత ఘనంగా ప్రారంభమైంది.
హైదరాబాద్ ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ కలిసి ఈ ఉపాధి జాతరను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్, మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మైనారిటీ గురుకులాల వైస్ చైర్మన్ ఫహీముద్దీన్ ఖురేషీ, సంక్షేమ శాఖ కార్యదర్శి బి. షఫీఉల్లా, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ సహా పలువురు ఉన్నతాధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.
మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ మాట్లాడుతూ, గత పదేళ్ల కాలంలో మైనారిటీల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేశారని, అయితే ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో గత రెండేళ్లలోనే ఎన్నో కీలక కార్యక్రమాలను వేగంగా అమలు చేసి చూపామని స్పష్టం చేశారు. మైనారిటీ వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.కేవలం ఆఫర్ లెటర్లు చేతిలో పెట్టి తమ బాధ్యత తీరిపోయిందని భావించమని స్పష్టం చేశారు. అభ్యర్థి సదరు కంపెనీలో చేరి, స్థిరపడే వరకు మొత్తం ప్రక్రియను ప్రభుత్వమే పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తుందన్నారు. యువతకు ఉపాధి కల్పించడం తన బాధ్యత మాత్రమే కాదనీ ఎన్నికల వాగ్దానం కూడా అని వివరించారు.
Also Read: ఇది మెట్రో స్టేషనా? తిరుపతి క్యూ లైనా? హైదరాబాద్ వాన బీభత్సం విజువల్స్ చూస్తే షాక్ అవుతారు!