Zojila Tunnel Project Explained: కాశ్మీర్–లడఖ్ మధ్య ఏడాదంతా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు కొనసాగేలా నిర్మిస్తున్న జోజిలా టన్నెల్ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. సుమారు 14.15 కిలోమీటర్ల పొడవుతో నిర్మితమవుతున్న ఈ భారీ సొరంగం తవ్వకాలు పూర్తయ్యాయి. తాజాగా నిర్వహించిన లాస్ట్ బ్లాస్టింగ్ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు.
జమ్మూ కాశ్మీర్ లోని సోన్ మార్గ్ ను లడఖ్ లోని మినామార్గ్ తో కలిపే ఈ టన్నెల్ పూర్తయితే దేశంలోనే అత్యంత పొడవైన రోడ్డు టన్నెల్ గా గుర్తింపు తెచ్చుకోనుంది. అంతేకాకుండా, ఆసియాలోనే అత్యంత పొడవైన డబుల్ వే టన్నెల్స్ లో ఒకటిగా గుర్తింపు పొందనుంది. సముద్ర మట్టానికి సుమారు 11,578 అడుగుల ఎత్తులో నిర్మితమవుతున్నది. దాదాపు రూ.6,500 కోట్లకు పైగా వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు కొన్ని కారణాల వల్ల ఆలస్యమైనప్పటికీ, 2028 నాటికి పూర్తిగా అందుబాటులోకి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు దేశానికి వ్యూహాత్మకంగానూ, ఆర్థికంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రస్తుతం కాశ్మీర్ నుంచి లడఖ్కు వెళ్లాలంటే జోజిలా కనుమ మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. శీతాకాలంలో భారీ మంచు కురవడం, కొండచరియలు విరిగిపడే ప్రమాదాల కారణంగా ఈ మార్గాన్ని నెలల తరబడి మూసివేస్తారు. ఫలితంగా లడఖ్ ప్రాంతం దేశంలోని మిగతా ప్రాంతాలతో దాదాపు ఐదు నెలల పాటు సంబంధాలు కోల్పోతుంది. అప్పుడు విమాన ప్రయాణమే ఏకైక మార్గం అవుతుంది. కానీ, ఆ సమయంలో విమాన టికెట్ల ధరలు భారీగా పెరిగి సాధారణ ప్రజలకు భారంగా మారుతాయి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా జోజిలా సొరంగం నిర్మిస్తున్నారు.
ఈ సొరంగం అందుబాటులోకి వస్తే కాశ్మీర్, లడఖ్ మధ్య అన్ని కాలాల్లోనూ రాకపోకలు సాగుతాయి. ప్రస్తుతం గందర్ బల్ నుంచి కార్గిల్ వరకు ప్రయాణానికి దాదాపు 4 గంటలు పడుతుండగా, సొరంగం ప్రారంభమైన తర్వాత అది కేవలం 20 నిమిషాలకు తగ్గనుంది. అలాగే బల్తాల్ నుంచి మినామార్గ్ వరకు ఉన్న 40 కిలోమీటర్ల దూరం 13 కిలోమీటర్లకు తగ్గుతుంది.
ఈ ప్రాజెక్టు కేవలం సౌకర్యవంతమైన ప్రయాణానికే కాకుండా జాతీయ భద్రతకు కూడా ఎంతో కీలకం. సరిహద్దు ప్రాంతాలకు సైనికులు, సామాగ్రిని వేగంగా తరలించే అవకాశం కలుగుతుంది. అలాగే పర్యాటకం, వ్యాపారం, స్థానిక ఉపాధి అవకాశాలకు కూడా కొత్త ఊతం లభిస్తుంది. జోజిలా సొరంగం మాత్రమే కాకుండా ఈ ప్రాంతంలో మొత్తం రూ.25 వేల కోట్ల వ్యయంతో 19 టన్నెల్స్ నిర్మాణం కొనసాగుతోంది. ఇందులో భాగంగా జెడ్-మోర్ నుంచి జోజిలా వరకు రహదారి విస్తరణ, కొత్త వంతెనలు, మంచు గ్యాలరీల నిర్మాణం కూడా చేపడుతున్నారు. జోజిలా టన్నెల్ ప్రారంభమైతే కాశ్మీర్–లడఖ్ మధ్య రవాణా మరింత సులభం కానుంది.
Read Also: E85 ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే ఏంటి? ఎలా తయారవుతుంది? దీని వల్ల కలిగే లాభాలేంటి?